-అక్టోబర్ 3 నాటికి స్వచ్ఛమైన ఓటరు జాబితా తయారీకి అందరూ కృషి చేయాలి …డీఆర్ఓ ఖాజావలి
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
డ్రాఫ్ట్ ఓటరు జాబితాలో ఉన్న తప్పులు, లోపాలను సరిదిద్దుకునేందుకు రాజకీయ పార్టీలు, ఓటర్లు కు నెలరోజుల పాటు లభించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ ఎస్ కె. ఖాజావలి కోరారు. శనివారం కలెక్టరేట్లో డ్రాఫ్ట్ ఎలక్ట్రోరల్ జాబితాపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. డ్రాఫ్ట్ ఓటరు జాబితాను క్షుణ్ణంగా పరిశీలించి అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో నమోదు అయ్యేలా, అనర్హుల పేర్లు తొలగించేలా రాజకీయ పార్టీలు ఎన్నికల అధికారులకు సహకరించాలని కోరారు. ఓటరు జాబితాలో పేర్లు చేర్పించడం, తొలగించడం, సవరణలు, చిరునామా మార్పులు వంటి అంశాలకు సంబంధించి దరఖాస్తులను నిర్ణీత గడువులోగా సమర్పించాలని సూచించారు.ప్రతి నియోజకవర్గానికి త్వరలో 20 మంది అసిస్టెంట్ ఎలక్టోరల్ ఆఫీసర్లను నియమించనున్నట్లు డీఆర్ఓ తెలిపారు. వారి ద్వారా ప్రత్యేకంగా క్షేత్రస్థాయిలో దరఖాస్తుల పరిశీలన, ఓటరు జాబితా సవరణలు వేగవంతంగా చేపడతామని చెప్పారు. అక్టోబర్ 3 నాటికి పూర్తిస్థాయిలో స్వచ్ఛమైన, పారదర్శకమైన ఓటరు జాబితాను సిద్ధం చేయడమే లక్ష్యమని, ఇందుకు అన్ని రాజకీయ పార్టీలు నిర్మాణాత్మక సహకారం అందించాలని డీఆర్ఓ విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశంలో టీడీపీ తరఫున శివరామయ్య, బీజేపీ తరఫున సుబ్బారావు, ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున సేవాకుమార్, జనసేన పార్టీ నుండి త్రినాధ్, వైఎస్సార్సీపీ తరఫున పిచ్చిరెడ్డి, బీఎస్పీ తరఫున వాసు, కాంగ్రెస్ తరఫున బ్రహ్మయ్య పాల్గొని పలు సూచనలు అందచేశారు.
Prajavartha Online Telugu News