-అర్హులైన నేతన్నలకు న్యాయం చేయాలి – ఎంపీ గురుమూర్తి
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
చేనేత కార్మికుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకంలో అర్హులైన లబ్ధిదారులకు అన్యాయం జరుగుతోందని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. చేనేత కార్మికులతో కలిసి జిల్లా కలెక్టర్ను కలిసి వారి సమస్యలను వివరించడంతో పాటు, అర్హులైన నేత కార్మికుల వివరాలను కలెక్టర్కు అందజేశారు.
మగ్గాలు ఉన్న నిజమైన చేనేత కార్మికులను పక్కనపెట్టి, మరణించిన వ్యక్తుల పేర్లతో, విదేశాల్లో ముఖ్యంగా దుబాయ్లో ఉన్నవారి పేర్లతో, అసలు మగ్గాలు లేని వారికి కూడా పథకం కింద లబ్ధి చేకూర్చడం అత్యంత దారుణమని ఎంపీ గురుమూర్తి అన్నారు. అర్హులైన దాదాపు 150 మంది మగ్గం కార్మికుల వివరాలను కలెక్టర్కు సమర్పించినట్లు తెలిపారు.
ఈ జాబితాపై క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలన జరిపి, నిజమైన అర్హులను గుర్తించి వారికి పథకం ద్వారా న్యాయం చేయాలని కలెక్టర్ను కోరినట్లు ఎంపీ తెలిపారు. సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపికలో రాజకీయాలకు తావివ్వడం సరికాదని, ఎవరైతే పథకానికి అర్హులో వారందరికీ కచ్చితంగా ప్రభుత్వ సంక్షేమ పథకం అందాలని స్పష్టం చేశారు.
గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అర్హతే ప్రామాణికంగా తీసుకుని సంక్షేమ పథకాలను నిష్పక్షపాతంగా అమలు చేశామని ఎంపీ గురుమూర్తి గుర్తుచేశారు. అదే విధంగా ప్రస్తుతం కూడా నిజమైన అర్హులైన చేనేత కార్మికులకు ఎలాంటి వివక్ష లేకుండా పథకం అందించాలని డిమాండ్ చేశారు. సంక్షేమ పథకాల అమలులో రాజకీయాలకు తావివ్వరాదని ఆయన అన్నారు. చేనేత కార్మికుల సంక్షేమం విషయంలో రాజకీయాలకు అతీతంగా వ్యవహరించి, అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎంపీ గురుమూర్తి కోరారు
Prajavartha Online Telugu News