-మహాబలిపురంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన సమావేశం
-హాజరుకానున్న 6 రాష్ట్రాల ముఖ్యమంత్రులు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
తమిళనాడులోని మహాబలిపురం వేదికగా గురువారం జరగనున్న 31వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ, పుదుచ్చేరి ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలను సమావేశంలో ప్రస్తావించనున్నారు. దక్షిణాది రాష్ట్రాల మధ్య సమన్వయం, అంతర్రాష్ట్ర సమస్యల పరిష్కారంతో పాటు ఏపీ పునర్విభజన చట్టం అమలు, పెండింగ్లో ఉన్న విభజన అంశాలు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై సీఎం చర్చించనున్నారు.
రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్లు పూర్తవుతున్నా పునర్విభజన చట్టంలోని వివిధ అంశాలు ఓ కొలిక్కి తీసుకువచ్చే అంశాన్ని సీఎం ప్రస్తావించనున్నారు. షెడ్యూల్-9-10లోని సంస్థల విభజన, ఆస్తులు–అప్పుల పంపకం, పెండింగ్ ఆర్థిక అంశాల పరిష్కారంపై కేంద్రం చొరవ తీసుకోవాలని కోరనున్నారు. రెవెన్యూ గ్యాప్, పన్ను సంబంధిత అంశాలను ముఖ్యమంత్రి ప్రస్తావించ నున్నారు.
కేంద్రం దృష్టికి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు
రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు
దుగరాజుపట్నం పోర్టు, విశాఖపట్నం–విజయవాడ మెట్రో ప్రాజెక్టులు, రైల్వే కనెక్టివిటీ, విమానాశ్రయాల అభివృద్ధి, పారిశ్రామిక కారిడార్ల వంటి అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నారు. విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు, పోలవరం ప్రాజెక్టు కు నిధులు వంటి అంశాల్లో కేంద్ర సహకారానికి కృతజ్ఞతలు తెలియజేయడంతో పాటు మిగిలిన ప్రాజెక్టులకు వేగంగా అనుమతులు, నిధులు, కేంద్ర సహకారం కోరనున్నారు.
Prajavartha Online Telugu News