-మంత్రి అచ్చెన్నాయుడు, అధికారులతో మాట్లాడిన సీఎం చంద్రబాబు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
సముద్రంలో గళ్ళంతైన బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన మత్స్యకారుల ఆచూకీని కనుగొనేందుకు గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. అల్లవరం మండలంలోని ఓడలరేవు, దుమ్మలపేట, వాసలతిప్ప గ్రామాలకు చెందిన ఏడుగురు మత్స్యకారుల గల్లంతు ఘటనలో జరుగుతున్న గాలింపు చర్యలపై సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి అచ్చెన్నాయుడు, అధికారులతో వర్చువల్ గా మాట్లాడారు. గాలింపు చర్యలు ఏ మేరకు జరుగుతున్నాయని అడిగి తెలుసుకున్నారు. మత్స్యకారుల ఆచూకీ కోసం కోస్ట్ గార్డ్స్, మెరైన్ పోలీసులు గాలిస్తున్నారని… జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు గాలింపు చర్యలను పర్యవేక్షిస్తోందని అధికారులు సీఎంకు తెలిపారు. ఇప్పటికే రెండు డార్నియర్ వినామాలు.. నేవీ బోట్లతో పాటు మరో ఏడు బోట్లతో గాలింపు చర్యలు చేపట్టినట్లు అధికారులు వివరించారు. కాకినాడ, భైరవపాలెం, విశాఖపట్నం, పారాదీప్ ప్రాంతాలకు చెందిన మత్స్యకారుల బోట్లను కూడా అప్రమత్తం చేసి గల్లంతైన బోటు ఆచూకీపై సమాచారం సేకరిస్తున్నామన్నారు. అయితే పారాదీప్ కు 14 నాటికల్ మైళ్ల దూరంలో కొన్ని పడవలను గుర్తించామని… వాటి గురించి ఆరా తీస్తున్నామని అధికారులు సీఎంకు తెలిపారు. గాలింపు చర్యలకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు ఆ ఏడు కుటుంబాలకు తెలియచేస్తూ ఉండాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
Prajavartha Online Telugu News