విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా దోమల ద్వారా వ్యాపించే మలేరియా, డెంగ్యూ, చికెన్గున్యా వంటి వ్యాధుల నివారణకు నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర ఆదేశాల మేరకు వీఎంసీ ముఖ్య వైద్య ఆరోగ్య అధికారి డా. గోపాల్ నాయక్ ఆధ్వర్యంలో బయాలజిస్ట్ సూర్య నాయక్ దోమల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ ఇన్చార్జ్ డాక్టర్ గోపాల నాయక్ మాట్లాడుతూ, నగరంలో దోమల నివారణతో పాటు దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల నియంత్రణకు ప్రజారోగ్య విభాగం ఆధ్వర్యంలో విస్తృత చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. యాంటీ -లార్వా ఆపరేషన్లు: మురుగు కాలువలు, నిల్వ నీటి ప్రదేశాల్లో దోమల లార్వా వృద్ధిని అరికట్టేందుకు ఎం.ఎల్. ఆయిల్, అబేట్ పిచికారీతో పాటు అవసరమైన ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా స్ప్రేయింగ్ నిర్వహిస్తున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో దోమల సాంద్రతను గుర్తించి నియంత్రించేందుకు ‘స్మార్ట్ మాస్కిటో ఎలిమినేటర్’, ‘సెన్సార్ ట్రాపర్స్’ వంటి ఆధునిక పరికరాలతో పాటు IoT ఆధారిత ఫాగింగ్ మిషన్లను వినియోగిస్తున్నారు.
నిల్వ ఉన్న స్వచ్ఛమైన నీటిలో దోమల లార్వాలను తినే గంభూషియా చేపలను విడుదల చేసి దోమల వృద్ధిని సహజ పద్ధతిలో నియంత్రిస్తున్నారు. నగరంలోని అన్ని వార్డుల్లో అవసరమైన ప్రాంతాల్లో క్రమం తప్పకుండా ఫాగింగ్ నిర్వహిస్తూ, ప్రతి శుక్రవారం ‘డ్రై డే’గా పాటించేలా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. బయాలజిస్ట్ సూర్య కుమార్ గారు మాట్లాడుతూ, ఇళ్ల పరిసరాల్లో పాత టైర్లు, కొబ్బరి బొండాలు, ప్లాస్టిక్ కప్పులు, పూల కుండీలు తదితర వస్తువుల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని సూచించారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు అవసరమైన సందర్భాల్లో దోమతెరలను వినియోగించాలని తెలిపారు. దోమల రహిత విజయవాడ నిర్మాణంలో ప్రతి నగరవాసి భాగస్వామి కావాలని కోరారు. ప్రజలు తమ ఇళ్లలోనూ, పరిసరాల్లోనూ నీరు నిల్వ ఉండకుండా చూసుకుంటే దోమల వృద్ధిని గణనీయంగా అరికట్టవచ్చని అధికారులు తెలిపారు. వీఎంసీ చేపడుతున్న దోమల నివారణ చర్యలకు ప్రజలు సహకరించి, ఆరోగ్యకరమైన విజయవాడ నిర్మాణానికి తోడ్పడాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (DM&HO) డా. A. శ్రవణ్ బాబు, జిల్లా మలేరియా అధికారి (DMO) D. రాజు నాయక్, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ముఖ్య వైద్య ఆరోగ్య అధికారి (CMHO) డా. గోపాల్ నాయక్, బయాలజిస్ట్ సూర్య కుమార్, మలేరియా సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News