-దత్తత ప్రక్రియలో అన్ని నిబంధనలు, పత్రాలను పరిశీలన
-జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్టీఆర్ జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ప్రత్యేక దత్తత సంస్థ శిశు గృహంలో సంరక్షణలో ఉన్న బాలుడిని గురువారం జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ ఆధ్వర్యంలో చట్టబద్ధంగా దత్తతు ప్రక్రియను చేపట్టడం జరిగింది. దత్తత ప్రక్రియలో భాగంగా బాలుడి గుర్తింపుకు సంబంధించిన వివరాలు, దత్తత తల్లిదండ్రుల ఆధార్ కార్డులు, సంబంధిత ధ్రువపత్రాలు, పత్రికా ప్రకటన, ఇతర అవసరమైన రికార్డులను పరిశీలించారు. దత్తత ప్రక్రియలో చట్టపరమైన నిబంధనలు, నిర్దేశిత విధానాలను తప్పనిసరిగా పాటించేలా అధికారులు తీసుకున్న చర్యలను జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. బాలుడి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి, ఇప్పటివరకు నిర్వహించిన వైద్య పరీక్షలు, ఆరోగ్య రికార్డుల గురించి జిల్లా కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. బాలుడి ఆరోగ్యానికి సంబంధించిన అన్ని వివరాలను దత్తత తల్లిదండ్రులకు తెలియజేయాలని సూచించారు.
దత్తత తీసుకుంటున్న తల్లిదండ్రులతో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ మాట్లాడి, బాలుడిని ప్రేమతో, బాధ్యతతో పెంచాలని సూచించారు. బాలుడి ఆరోగ్యం, పోషణ, విద్య, భద్రత, సంక్షేమం మరియు సమగ్ర అభివృద్ధికి అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. బాలుడికి సురక్షితమైన, ప్రేమపూర్వకమైన కుటుంబ వాతావరణాన్ని కల్పిస్తూ, అతని భవిష్యత్తుకు అవసరమైన అవకాశాలను అందించాలని దత్తత తల్లిదండ్రులకు సూచించారు. దత్తత అనంతరం బాలుడికి కన్నబిడ్డతో సమానంగా అన్ని హక్కులు, బాధ్యతలు, కుటుంబ సౌకర్యాలు కల్పించబడతాయని అధికారులు తెలిపారు. దత్తత ప్రక్రియను సంబంధిత చట్టపరమైన నిబంధనలు, మార్గదర్శకాలకు అనుగుణంగా పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. బాలల సంరక్షణ, రక్షణ, సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని అధికారులు తెలిపారు. శిశు గృహంలో సంరక్షణ పొందుతున్న బాలల భద్రత, ఆరోగ్యం, పోషణ, విద్య, భవిష్యత్ సంక్షేమానికి అవసరమైన చర్యలను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. చట్టబద్ధమైన దత్తత ప్రక్రియ ద్వారా పిల్లలకు సురక్షితమైన కుటుంబ వాతావరణం, మెరుగైన భవిష్యత్తు కల్పించేందుకు సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ షేక్ రుక్సానా సుల్తానా బేగం, అడాప్షన్ ఆఫీసర్ జాన్సన్, లీగల్ ఆఫీసర్ కిరణ్, శిశు గృహ మేనేజర్ దీపిక, సోషల్ వర్కర్ అరుణ, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News