-అద్దంకిలోని పలు కాలనీల్లో సుడిగాలి పర్యటన
-సమస్యల సత్వర పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు
అద్దంకి, నేటి పత్రిక ప్రజావార్త :
పట్టణంలోని పలు కాలనీల్లో ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గురువారం సుడిగాలి పర్యటన జరిపారు. ప్రజలతో ముఖాముఖి అయి వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అద్దంకి పట్టణంలోని బట్టి బడి, గుర్రాల కాలనీ, బోడెంపూడివారి పాలెం, బలిజపాలెం కాలనీలతో పాటు జూనియర్ కాలేజీ ప్రాంతాల్లో మంత్రి గొట్టిపాటి పర్యటించారు. స్థానికులతో మాట్లాడి తాగునీరు, రోడ్లు, పారిశుధ్యం, ఇతర మౌలిక వసతులపై వివరాలు తెలుసుకున్నారు. వారి ఇబ్బందులను ఆరా తీశారు. కాలనీల్లో పారిశుధ్య నిర్వహణ, ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. తాగు నీరు, రోడ్ల సమస్యల పరిష్కారంతో పాటు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని స్పష్టం చేశారు.
బాడ్మింటన్ కోర్టు, జిమ్ నిర్మాణ ప్రాంతాల పరిశీలన…
అద్దంకి కాలనీల పర్యటన ముగిసిన తర్వాత మంత్రి గొట్టిపాటి ప్రభుత్వ జూనియర్ కళాశాల పరిసరాల్లో కొత్తగా నిర్మించనున్న ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్టు, జిమ్ నిర్మాణాల ప్రతిపాదిత ప్రాంతాలను పరిశీలించారు. ప్రతిపాదిత నిర్మాణాలపై అధికారులతో చర్చించారు. పనులకు సంబంధించిన ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధం చేసి వేగంగా ముందుకు వెళ్లాలని మంత్రి గొట్టిపాటి ఆదేశించారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, స్థానిక నేతలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News