– నూతన ఆవిష్కరణల దిశగా ప్రోత్సహించేందుకు సరైన వేదిక
– జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యార్థులు, యువతలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించి.. వారిని నూతన ఆవిష్కరణల దిశగా ప్రోత్సహించే లక్ష్యంతో గోరా టెక్నో హబ్ను ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయమని కలెక్టర్ ఎస్.డిల్లీరావు అన్నారు.
విజయవాడ బెంజ్ సర్కిల్ సమీపంలోని నాస్తిక కేంద్రంలో డా. జి.సమరం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గోరా టెక్నో హబ్ను కలెక్టర్ డిల్లీరావు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ సైన్స్ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసిన అనంతరం మాట్లాడుతూ ఎంతో గొప్ప ఉద్దేశంతో సేవాభావంతో దార్శనికతతో డా. జి.సమరం టెక్నో హబ్ ఏర్పాటు చేశారని.. రోబోటిక్స్, కృత్రిమ మేధ (ఏఐ), క్వాంటం కంప్యూటింగ్, సూపర్ కండక్టర్స్ తదితర ఆధునిక సాంకేతికతలకు సంబంధించి శాస్త్రీయ అవగాహనను పెంపొందించి.. దేశాన్ని శాస్త్రసాంకేతిక రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించడంలో యువతను భాగస్వామ్యం చేసే ఉద్దేశంతో ఈ హబ్ను ఏర్పాటు చేసినందుకు డా. జి.సమరం గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నానని.. ఆయన సేవలు వెలకట్టలేనివని తెలిపారు. టెక్నో పార్కు/టెక్నో విలేజ్ ఏర్పాటు ఆయన లక్ష్యమని.. ఆ లక్ష్య సాధనకు అవసరమైన సహాయ సహకారాలు అందించనున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు శాస్త్రీయ పరిజ్ఞానానికి సంబంధించి అప్లికేషన్ నైపుణ్యాలు పెంపొందించుకోవాలని.. అవే నూతన ఆవిష్కరణల దిశగా నడిపిస్తాయని పేర్కొన్నారు. ఈ హబ్ ఏర్పాటులో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలియజేస్తున్నట్లు కలెక్టర్ డిల్లీరావు తెలిపారు.
డా. జి.సమరం మాట్లాడుతూ దేశీయ శాస్త్రసాంకేతికతల ద్వారా వికసిత్ భారత్ను సాకారం చేయడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా సగర్వంగా నిలబెట్టేందుకు, అన్ని రంగాల్లోనూ నెం.1గా నిలిపేందుకు పాటుపడాలన్నారు. గోరా టెక్నో హబ్.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలకు సంబంధించిన వర్కింగ్ మోడల్స్తో వర్ధిల్లుతుందన్నారు. ఇదో విశిష్ట కేంద్రమని.. సైన్స్ ఔత్సాహికులకు ప్రేరణగా నిలిచి, ప్రోత్సహించేందుకు దోహదం చేస్తుందని డా. జి.సమరం అన్నారు.
కార్యక్రమంలో ప్రొఫెసర్ లక్ష్మీదేవి, ప్రొఫెసర్ నరేష్, డా. జి.మారు, జి.రష్మి సమరం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News