–మండల విద్యాశాఖ అధికారి బి సోమశేఖర్ నాయక్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైకల్యాన్ని అధిగమించి ఆత్మవిశ్వాసంతో దివ్యాంగులు ముందుకు సాగుతూ జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని మండల విద్యాశాఖ అధికారి బి సోమశేఖర్ నాయక్ అన్నారు. కొత్తపేట లోని దలవాయి సుబ్బరామయ్య ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఉన్న భవిత సెంటర్ నందు మంగళవారం అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మండల విద్యాశాఖ అధికారి బి సోమశేఖర్ ముఖ్యఅతిథిగా హాజరై వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ దివ్యాంగులు ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకొని ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలన్నారు. దివ్యాంగుల కోసం ప్రభుత్వాలు అందించే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దివ్యాంగుల తల్లిదండ్రులు వారిలోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తే ఉన్నత స్థానాలకు చేరుకుంటారన్నారు. ఎంతోమంది దివ్యాంగులుగా ఉండి ఐఏఎస్, ఐపీఎస్ వంటి రంగాల్లో రాణించారని గుర్తు చేశారు. ప్రధానోపాధ్యాయురాలు అనసూయ మాట్లాడుతూ దివ్యాంగుల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేస్తుందని వాటిని సద్వినియోగం చేసుకుంటూ సకలాంగులతో సమానంగా జీవించుటకు ముందుకు సాగాలని అన్నారు. అనంతరం దివ్యాంగులకు నిర్వహించిన క్రీడల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఐ ఇ ఆర్ టి టీచర్లు ఎన్ సింధు, కే తేజస్వి, సౌజన్య దివ్యాంగ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Prajavartha Online Telugu News