– విపత్తు సమయంలో ఎలా స్పందించాలి?
– ప్రజలకు అవగాహన కల్పించేందుకు మాక్ డ్రిల్
– 12 న ఉదయం కలెక్టరేట్ లో మాక్ డ్రిల్ ను తిలకించండి
– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదాలు సంభవిస్తే మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి? అగ్ని కీలల్లో, ఉక్కిరిబిక్కిరి చేసే పొగల్లో ఎవరైనా చిక్కుకుంటే ఎలా కాపాడాలి? భూకంపాలు, ఎడతెరపి లేకుండా కురిసే భారీ వర్షాలు సమయాల్లో భవనాలు కూలితే ఏమిచేయాలి? ఇలా వివిధ విపత్తుల సమయంలో సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే విలువైన ప్రాణాలను కాపాడవచ్చని.. ఈ నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ నెల 12న కలెక్టరేట్లో మాక్ డ్రిల్ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.
అగ్ని మాపక శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 8.30 గంటల నుంచి 9 గంటల వరకు మాక్ డ్రిల్ నిర్వహించడం జరుగుతుందని.. ఈ కార్యక్రమంలో రెవెన్యూ, పోలీస్, రవాణా తదితర శాఖల జిల్లాస్థాయి అధికారులు పాల్గొంటారని, నగర ప్రజలు కూడా కార్యక్రమాన్ని తిలకించి అవగాహన కల్పించుకోవాలని కలెక్టర్ కోరారు. విపత్తు నిర్వహణ (Disaster Management)లో భాగంగా అత్యవసర సమయాల్లో ఎలా స్పందించాలి? అనే దానిపై అవగాహన కల్పించడం ముఖ్యమని, సన్నద్ధత ప్రణాళికను సమీక్షించేందుకు ఇలాంటి మాక్ డ్రిల్స్ దోహదం చేస్తాయని కలెక్టర్ లక్ష్మీశ ప్రకటనలో తెలిపారు
Prajavartha Online Telugu News