-జూన్ 9న మండల కేంద్రాలలో ధర్నాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వరి ధాన్యంతో పాటు కేంద్ర ప్రభుత్వం పంట ఉత్పత్తులకు ప్రకటించిన మద్దతు ధరలపై పున: సమీక్ష చేసి డా॥ యం.యస్. స్వామినాధన్ కమీషన్ సిఫార్సుల ప్రకారం ( సి2G50%) ప్రకటించాలని జూన్ 9న రాష్ట్ర వ్యాప్తంగా మండల రెవిన్యూ కార్యాలయాలవద్ద ధర్నాలు నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రైతుసంఘ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి. ఈశ్వరయ్య, కె.వి.వి.ప్రసాద్లు తెలిపారు.
రాబోయే ఖరీఫ్ సీజన్కు కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యానికి క్వింటాకు కేవలం 69 రూపాయలు పెంచుతూ ప్రకటించిన ప్రకారం క్వింటా ధాన్యం ధర 2,369 రూపాయలు అవుతుంది. జాతీయ రైతు కమీషన్ ఛైర్మన్ డా॥ యం.యస్. స్వామినాథన్ కమిటీ సిఫార్సుల ప్రకారం (సి2G50%) మద్దతు ధర 3135 లభించాల్సి ఉన్నది. సి2G50% ప్రకారం రైతాంగ ఉత్పత్తులకు మద్దతు ధరలు లభించకపోవడంవల్ల వరిధాన్యం పండిరచే రైతులు క్వింటాకు 766 రూపాయలు నష్టపోవాల్సి వస్తుంది. కేంద్ర ప్రభుత్వం 14 పంటలకు ప్రకటించిన యం.యస్.పి.లో వ్యత్యాసంతో రైతులు తీవ్రంగా నష్టపోతారు. ప్రతి సంవత్సరం పంటల ఉత్పత్తి వ్యయం ఖరీఫ్, రబీ సీజన్లలో పెరుగుతూనే ఉన్నది. ఎరువులు, విత్తనాలు, పురుగుమందలు ధరలపై నియంత్రణ లేకపోవడం ఉత్పత్తి వ్యయం పెరుగుదలకు ప్రధాన కారణం. పెరుగుతున్న ఉత్పత్తి ఖర్చులకనుగుణంగా మద్దుతు ధరలు నిర్ణయించాలని స్వామినాధన్ సూచించారు. 2014 ఎన్నికల సమయంలో నరేంద్రమోడీ స్వామినాధన్ సిఫార్సుల ప్రకారం మద్దతు ధరలు అమలు చేస్తామని ఇచ్చిన హామీ నేటికి అమలు కాలేదు. మూడు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా 13 మాసాలపాటు రైతాంగం ఉద్యమించి ఉద్యమ విరమణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రైతు సంఘాలకు లిఖిత పూర్వకంగా హామీ యిచ్చి నేటికి అమలు చేయకపోవడం మోసపూరితమన్నారు.
మద్దతు ధరలు లభించకపోవడంతో రైతాంగం ప్రతి సంవత్సరం సుమారు 2.5 లక్షల కోట్లు నష్టపోతున్నారు. ఫలితంగా రైతాంగ ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. వ్యవసాయాన్ని వదిలేవారి సంఖ్య పెరుగుతున్నది. ఈ స్థితిలో కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరల పెంపుపై పున: సమీక్షించి వరి ధాన్యానికి క్వింటాకు 3 వేలకు తగ్గకుండా నిర్ణయించాలి. కేంద్రం ప్రకటించిన మిగతా పంటలకు సైతం స్వామినాధన్ కమీషన్ సిఫార్సులకనుగుణంగా మద్దతు ధరలు పెంచాలి. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ప్రకటించిన మద్దతు ధరలపై ఒత్తిడి తెచ్చి పెంపుకు కృషి చేయాలి. అదే విధంగా వరి ధాన్యానికి క్వింటాకు 500 రూపాయలు బోనస్ ప్రకటించి రాష్ట్రంలోని వరి రైతాంగాన్ని ఆదుకోవాలని కోరుతూ జూన్ 9న మండల తహశీల్దార్ కార్యాలయాల వద్ద జరుగు ధర్నాలో రైతులు, కౌలు రైతులు అత్యధిక సంఖ్యలో పాల్గొనాలని జి. ఈశ్వరయ్య, కె.వి.వి.ప్రసాద్లు పిలుపునిచ్చారు.
Prajavartha Online Telugu News