విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడలోని కేడీసీసీ రీజనల్ కార్యాలయంలో ఈరోజు మాజీ మంత్రి మరియు కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం ఆహ్వానం మేరకు నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ (NAFSCOB) చైర్మన్ మరియు మాజీ తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంకు లిమిటెడ్ (టెస్కాబ్) చైర్మన్ కరీంనగర్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ కొండూరు రవీందర్రావు మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. సమావేశం సందర్భంగా నెట్టెం రఘురాం, రవీందర్రావు ని శాలువాతో సత్కరించి, స్మారక చిహ్నం (మెమెంటో) అందజేశారు. కోఆపరేటివ్ రంగ అభివృద్ధికి ఆయన అందిస్తున్న సేవలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
తదనంతరం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని డీసీసీబీ పరిధిలోని సహకార సొసైటీల ఆర్థిక బలోపేతం కోసం అవసరమైన చర్యలను నెట్టెం రఘురాం వివరించారు. ప్రస్తుతం CMA Norms ప్రకారం ఉన్న ₹40 లక్షల క్రెడిట్ లిమిట్ను పెంచాలని, తద్వారా గ్రామీణ సహకార వ్యవస్థ మరింత బలపడుతుందని పేర్కొన్నారు. అలాగే, రైతులకు అందుతున్న క్రాప్ లోన్లపై నాబార్డ్ నుంచి వచ్చే లిమిట్ను తగ్గించకుండా, దానిని మరింత పెంచేలా చర్యలు తీసుకోవాలని ఆయన అభ్యర్థించారు.గ్రామీణ పరిశ్రమల అభివృద్ధి కోసం MSME ప్రాజెక్టులకు మరింత చేయూత అందించాలని, ఇందుకు సంబంధించి మార్గదర్శకాలు మరియు ఫండింగ్ సపోర్ట్ను బలోపేతం చేయాల్సిన అవసరాన్ని కూడా నొక్కి చెప్పారు.
ఈ సందర్భంలో, తెలంగాణ రాష్ట్రంలో అత్యుత్తమ పనితీరుతో గుర్తింపు పొందిన కరీంనగర్ డీసీసీబీకి మీరు తప్పకుండా రావాలని రవీందర్రావు, నెట్టెం రఘురాం ని ఆహ్వానించారు. రెండు సంస్థల మధ్య కోఆపరేటివ్ రంగ అభివృద్ధికి సంబంధించిన అనుభవాలు, ఉత్తమ పద్ధతుల మార్పిడి, పరస్పర సహకారంపై చర్చించేందుకు ఈ పర్యటన ఎంతో ఉపయోగకరమని ఆయన పేర్కొన్నారు.
సమావేశం మొత్తం సానుకూల వాతావరణంలో సాగి, కోఆపరేటివ్ బ్యాంకింగ్ రంగ భవిష్యత్ పురోగతికి సంబంధించిన ముఖ్యమైన అంశాలపై ఇద్దరి మధ్య విస్తృత చర్చలు జరిగాయి. ఈ కార్యక్రమంలో కేడీసీసీ బ్యాంకు సీఈవో శ్యాం మనోహర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News