– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈవీఎం, వీవీప్యాట్ గోదాముకు పటిష్ట భద్రత కల్పించడం జరిగిందని.. అయినప్పటికీ నిరంతర పర్యవేక్షణతో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు.
భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా సాధారణ నెలవారీ తనిఖీల్లో భాగంగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి శుక్రవారం కలెక్టర్ లక్ష్మీశ గొల్లపూడిలోని ఈవీఎం, వీవీప్యాట్ల గోదామును పరిశీలించారు. సీసీ కెమెరాల పనితీరుతో పాటు అగ్నిమాపక విద్యుత్ పరికరాలను పరిశీలించి అనంతరం పర్యవేక్షణ రిజిస్టర్లో సంతకం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈవీఎం, వీవీప్యాట్లను భద్రపరుస్తున్న గోదామును క్షుణ్ణంగా తనిఖీ చేసి ఎప్పటికప్పుడు సమగ్ర నివేదికను అందించడం జరుగుతోందన్నారు. అదేవిధంగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలోనూ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గోదాము వద్ద విధులు నిర్వహిస్తున్న భద్రతా సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉంటూ సీసీ కెమెరాల పర్యవేక్షణతో గట్టి నిఘా ఉంచాలని కలెక్టర్ లక్ష్మీశ అధికారులకు సూచించారు.
ఈవీఎం, వీవీప్యాట్ల గోదాము తనిఖీలో జిల్లా కలెక్టర్తో పాటు డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, బి.మురళీకృష్ణ (భారత జాతీయ కాంగ్రెస్), ఏదుపాటి రామయ్య (తెదేపా), గాలంకి వెంకటేశ్వరరావు (బీఎస్పీ), జగడం శ్రీనివాసరావు (జనసేన పార్టీ), కందుల పరమేశ్వరరావు (ఏఏపీ), యారడ్ల ఆంజనేయ రెడ్డి (వైఎస్ఆర్సీపీ) తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News