అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఎప్పటి నుంచో తనను చూడాలనుకుంటున్న ఓ అభిమాని కోరికను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీర్చారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం కామధేనువులంక గ్రామానికి చెందిన సత్యనారాయణ అనే వృద్ధుడు సీఎం చంద్రబాబుకు వీరాభిమాని. తమ నియోజకవర్గానికి చంద్రబాబు వస్తున్నారని, దూరం నుంచైనా ఆయన్ను చూడాలని మాట్లాడిన వీడియో వైరల్ అయ్యి సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్లిన విషయం తెలిసిందే. సత్యనారాయణ గారూ సిద్ధాంతంలో కలుద్దాం అని సీఎం రిప్లై కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో సోమవారం మీ భూమి – మీ హక్కు కార్యక్రమంలో పాల్గొనేందుకు సిద్దాంతం వెళ్లిన సీఎం చంద్రబాబు…కార్యక్రమం అనంతరం తన బస్సులోకి సత్యనారాయణను ప్రత్యేకంగా పిలుపించుకున్నారు. కాసేపు ఆత్మీయంగా మాట్లాడి కుటుంబ వివరాలు, ఆరోగ్యం గురించి ఆరా తీశారు. తన కుమారుడు అనారోగ్యంతో బాధపడుతున్నాడని, అతనికి వైద్యసాయం అందించాలని సత్యనారాయణ ముఖ్యమంత్రిని కోరారు. తమ గ్రామానికి డ్రైనేజ్ సదుపాయం కల్పించాలని ముఖ్యమంత్రికి విన్నవించారు. తన అభిమాని కుమారుడికి వైద్యం చేయిస్తానని భరోసా ఇచ్చిన సీఎం… సత్యనారాయణకు ఇల్లు నిర్మించి ఇవ్వాలని కలెక్టర్ను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.
Prajavartha Online Telugu News