– ఆపరేషన్ క్లీన్ స్వీప్తో ప్లాస్టిక్ రహిత గ్రామాల దిశగా అడుగులు
– పరిశుభ్ర గ్రామాల కోసం ప్రజలందరి భాగస్వామ్యం అవసరం!
– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, ఎమ్మెల్యే శ్రీరాంరాజగోపాల్
జగ్గయ్యపేట, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ నెల థీమ్గా చేపట్టిన “ఆపరేషన్ క్లీన్ స్వీప్” కార్యక్రమాన్ని శనివారం జగ్గయ్యపేట మండలం ధర్మవరపుపాడు తండా గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) విశిష్ట అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ మాట్లాడుతూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం పర్యావరణానికి, ప్రజారోగ్యానికి తీవ్ర ముప్పుగా మారిందన్నారు. ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల నేల, నీరు, గాలి కలుషితమవుతున్నాయని, భవిష్యత్ తరాల ఆరోగ్యంపై కూడా దుష్ప్రభావం పడుతుందని తెలిపారు. ప్లాస్టిక్ రహిత గ్రామాల నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. ప్రజలందరూ ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల వినియోగాన్ని పూర్తిగా మానుకుని గుడ్డ సంచులను మాత్రమే వినియోగించాలని కలెక్టర్ సూచించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా గుడ్డ సంచుల వినియోగాన్ని ఒక సామాజిక ఉద్యమంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.
శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) మాట్లాడుతూ, గ్రామాల పరిశుభ్రతకు ప్రజల భాగస్వామ్యం అత్యంత అవసరమన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిర్మూలనలో ప్రతి కుటుంబం భాగస్వాములు కావాలని కోరారు. గుడ్డ సంచుల వినియోగాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో గ్రామస్తులకు గుడ్డ సంచులను పంపిణీ చేశారు.
గ్రామ పంచాయతీలను పరిశుభ్రంగా ఉంచేందుకు పంచాయతీ సిబ్బందికి ప్రజలు సహకరించాలని అధికారులు సూచించారు. ఇంటి వద్దనే చెత్తను సక్రమంగా నిర్వహించడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం ద్వారా స్వచ్ఛమైన గ్రామాల నిర్మాణం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి సీతామహాలక్ష్మి, రెవెన్యూ డివిజనల్ అధికారి జి. అనిల్ కుమార్, డివిజనల్ పంచాయతీ అధికారి రాఘవన్, మండల అధికారులు, గ్రామాధికారులు, గ్రామ నాయకులు, పంచాయతీ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News