విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పేదలకు చదువు భారం కాకూడదనే మహోన్నత ఆశయంతో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యా విప్లవానికి శ్రీకారం చుట్టిందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గంలో మూడో విడత అమ్మఒడి పథకం ద్వారా 25,144 మంది తల్లుల ఖాతాలలో సోమవారం రూ. 37.71 కోట్ల నగదు జమ కానున్నట్లు ఓ ప్రకటనలో వెల్లడించారు. 2019–20లో ఈ పథకం ద్వారా 22,095 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.33.14 కోట్ల నగదు జమ చేస్తే, 2020–21లో 27,170 తల్లుల అకౌంట్ లలో రూ. 40.75 కోట్ల నగదు జమ చేసినట్లు వివరించారు. మొత్తంగా మూడేళ్లలో రూ. 111 కోట్ల 61లక్షల లబ్ధి చేకూర్చినట్లు వివరించారు. విద్యార్థుల భవిష్యత్ పట్ల ముఖ్యమంత్రికి ఉన్న చిత్తశుద్ధికి ఇదొక నిదర్శనమని చెప్పుకొచ్చారు. నాడు–నేడు, ఇంగ్లిష్ మీడియం, విద్యాకానుక, అమ్మ ఒడి, గోరుముద్దలాంటి కార్యక్రమాలతో విద్యారంగంలో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చరిత్ర సృష్టించిందన్నారు. ప్రతీ పేద విద్యార్థి తాను కలలుగన్న విద్యను అభ్యసించేందుకు.. ఈ కార్యక్రమాలు ఎంతగానో దోహదపడుతున్నాయన్నారు. తమ చిన్నారులను ఉన్నత చదువులు చదివించాలనుకునే తల్లిదండ్రులు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోన్న సాయాన్ని సద్వినియోగపరచుకోవాలని సూచించారు. పథకానికి అర్హులై ఉండి లబ్ది పొందలేని వారు మరలా దరఖాస్తు చేసుకోవచ్చని ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. భావితరాల తలరాతలు మార్చేందుకు అహర్నిశలు కృషి చేస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రతిఒక్కరూ అండగా నిలవాలని కోరారు.
Prajavartha Online Telugu News