జగ్గయ్యపేట, నేటి పత్రిక ప్రజావార్త :
సోమవారం జగ్గయ్యపేట మండలం, గండ్రాయి గ్రామంలో కమ్యూనిటీ గోకులం (యానిమల్ హాస్టల్) ను జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ సందర్శించారు. అక్కడ పశు పోషణకు చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. రూ. 10 లక్షల నిధులతో పల్లెపండగ 2.0 ద్వారా నిర్మించిన గోకులంలో 24 పశువుల సంరక్షణకు సరిపడా సౌకర్యాలు ఉన్నాయి. స్థానిక పాడి రైతులకు ఇది ఎంతో ప్రయోజనం చేకూర్చనుంది. షెడ్డుతో పాటు పశువులను కట్టుకునేందుకు సౌకర్యాలు కల్పించారు. ఎండుగడ్డి లేదా పచ్చి మేతను చిన్న, ఏకరీతి ముక్కలుగా కోయడానికి చాప్ కట్టర్, మంచి నీటి సౌకర్యం కల్పించడం జరిగింది. పశుపోషణ, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. సన్న చిన్నకారు రైతులకు అండగా ప్రభుత్వం నుండి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు వివరించారు. వీటిని రైతులు సద్వినియోగం చేసుకొని తమ కుటుంబాలను ఆర్థికంగా ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలన్నారు.
Prajavartha Online Telugu News