-అధికారులతో సమీక్ష సమావేశం
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వేసవిలో విజయవాడ నగర పాలక సంస్థ వారు కల్పించే సౌకర్యాలలో ఎటువంటి ఇబ్బందులు ప్రజలు ఎదుర్కోకూడదని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. బుధవారం ఉదయం కార్పొరేషన్ ప్రథమ కార్యాలయంలో గల నూతన భవనంలోని సమావేశపు హాల్లో ఇంజనీరింగ్ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వేసవిలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకూడదని ప్రత్యేకించి త్రాగునీటి సరఫరా లో కొండప్రాంతాలకి ఎటువంటి లోటు లేకుండా నీటి సరఫరా జరగాలని అన్నారు. అందుకు అనుగుణంగా కావాల్సిన వాహనాలను, వాటర్ ట్యాంకర్లను, సమకూర్చుకోవాలని. జనాభా ఎక్కువగా ఉన్నచోట త్రాగునీటి సౌకర్యాలను మరింత పెంచాలని, కొండ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు త్రాగునీటి సౌకర్యం కల్పించేందుకు విజయవాడ నగరపాలక సంస్థ కావలసిన చర్యలను తీసుకోవాలని. గత సంవత్సరంలో మంచి నీటి సమస్యలు ఉన్న ఇల్లులు, ప్రదేశాలు ను దృష్టిలో ఉంచుకొని ముందుగానే వారికి నీటి సరఫరా అయ్యేటట్టు ప్రణాళికను సిద్ధం చెయ్యాలని అధికారులను ఆదేశించారు.
నగర పరిధిలోగల ప్రాజెక్టులు, పార్కుల నిర్వహణలో ఎటువంటి ఇబ్బంది కలగకుండా, ప్రణాళిక సిద్ధం చేయాలని, ప్రస్తుతం ఉన్న అన్ని బోరులను ఉపయోగంలోకి తీసుకురావాలని, అసిస్టెంట్ ఇంజనీర్లు అందరూ ప్రజలతో మాట్లాడి వారి అవసరాలను తెలుసుకొని వారి ఇబ్బందులను కనుక్కొని, వారికి అన్ని అవసరాలు తీరేటట్టు, ఇబ్బందులు లేకుండా చూసేటట్టు ప్రణాళికను సిద్ధం చేయాలని ఆదేశించారు.
విజయవాడ నగర పరిధిలోగల అన్ని ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పర్యటించి ఎటువంటి నీటి లీకేజీలు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులందరూ అప్రమత్తంగా ఉంటూ లీకేజీలన్నీ ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయాలని అధికారులను ఆదేశించారు. వేసవి కాలంలో ప్రజలు ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉండేందుకు పక్కా ప్రణాళికతో తదుపరి నిర్వహించే సమీక్ష సమావేశంలో చర్చించాలని ఆదేశాలు ఇచ్చారు.
ఈ సమావేశంలో సర్కిల్ పరిధిలో గల అసిస్టెంట్ ఇంజనీర్లతో, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లతో, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లతో వారు విధులు నిర్వహిస్తున్న వార్డు, ఆ ప్రాంతంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకున్నారు. ఆ సమస్యలను పరిష్కరించే దిశగా సమావేశంలో చర్చించారు.
ఈ సమావేశంలో సూపరిండెంటింగ్ ఇంజనీర్స్ పి సత్యనారాయణ, పి సత్యకుమారి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, అసిస్టెంట్ ఇంజనీర్లు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News