-ఏఐ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించండి
-ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలు పరిశీలించాలి
-గుండాల కోన దుర్ఘటన నేపథ్యంలో అటవీ శాఖ ఉన్నతాధికారులు, అన్నమయ్య జిల్లా కలెక్టర్, ఎస్పీ, డి.ఎఫ్.ఓ.లతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ సమీక్ష
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
మహా శివరాత్రి రానున్న క్రమంలో అటవీ ప్రాంతంలో ఉన్న గుండాల కోన శివాలయానికి వెళ్ళిన ముగ్గురు భక్తులు ఏనుగుల తొక్కిసలాటలో దుర్మరణం పాలవడం బాధాకరమని, ఇటువంటి దుర్ఘటనలు నివారించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. మహా శివరాత్రి సందర్భంగా అటవీ ప్రాంతాల్లోని ఆలయాలకు వెళ్ళేవారి రక్షణకు తగిన చర్యలు చేపట్టాలని, పోలీసు, దేవాదాయ, రెవెన్యూ శాఖలతో సమన్వయం చేసుకోవాలని స్పష్టం చేశారు. అన్నమయ్య జిల్లా కోడూరు అటవీ రేంజిలోని గుండాల కోన దగ్గర ఏనుగులు తొక్కేయడంతో ముగ్గురు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో అటవీ శాఖ ఉన్నతాధికారులు, అన్నమయ్య జిల్లా కలెక్టర్, ఎస్పీలతో సమీక్ష నిర్వహించారు. మృతుల కుటుంబాలకు, గాయపడిన వారి కుటుంబాలకు తీవ్ర సానుభూతి తెలియచేశారు.
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ అటవీ, వన్యప్రాణి సంరక్షణ అధికారులతో పలు అంశాలపై చర్చించారు. ఏనుగులు సంచరించే ప్రాంతాలలోని ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ రక్షణ కల్పించాలన్నారు. కర్ణాటకలో ఏఐ పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారనీ, అదే విధంగా ఇతర సాంకేతిక పరిజ్ఞానాలను, విధానాలను పరిశీలించి అమలు చేయాలని ఆదేశించారు. ఏనుగుల కదలికలు ఉన్న ప్రాంతాలలో రైల్వే లైన్ బారికేడింగ్ చేయాలన్నారు. ఏనుగుల కదలికను ట్రాక్ చేయడానికి రేడియో కాలరింగ్, ఇతర అధునాతన ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను ఏర్పాటు చేయాలని సూచించారు. స్థానిక నివాసితులతోపాటు, అటవీ ప్రాంతాల్లోని ఆలయాలకు వెళ్ళే యాత్రికులకు ఏనుగుల ప్రవర్తన, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, భద్రత చర్యల గురించి అవగాహన కల్పించేదుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని తెలిపారు. మానవుల భద్రత-వన్యప్రాణుల సంరక్షణ.. రెండు అంశాలను పరిగణనలోకి తీసుకొని భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలను పునారావృతం కాకుండా దీర్ఘకాలిక పరిష్కారాలను కనుగొని నివేదిక ఇవ్వాలని అటవీ, వన్యప్రాణి సంరక్షణ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రిన్సిపుల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ చిరంజీవి చౌదరి, ఉన్నతాధికారులు ఎ.కె.నాయక్, డాక్టర్ శాంతిప్రియ పాండే, బి.ఎన్.ఎన్.మూర్తి పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్నమయ్య జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్, ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, డిఎఫ్ఓ జగన్నాథ్ సింగ్ హాజరయ్యారు.
Prajavartha Online Telugu News