-ప్రజారోగ్య పరిరక్షణలో ఆంధ్రప్రదేశ్ ముందడుగు
-ముఖ్యమంత్రికి వైద్య ఆరోగ్యమంత్రి సత్యకుమార్ యాదవ్ అభినందనలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
డాక్టర్ ఎన్ టిఆర్ వైద్యసేవ పథకాన్ని హైబ్రిడ్ విధానంలో విస్తరిం చాలన్న నిర్ణయాన్ని ప్రకటించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ అభినందనలు తెలియచేశారు. ప్రజారోగ్య పరిరక్షణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ విధానంపై మంగళవారం ముఖ్యమంత్రి అసెంబ్లీలో చేసిన ప్రకటనపై హర్షాన్ని వ్యక్తం చేస్తూ సామాజిక మాధ్యమం ఎక్స్ లో మంత్రి ట్వీట్ చేశారు. ‘అందరికీ అందుబాటులో ఉండే ఆరోగ్య సంరక్షణ కోసం అచంచలమైన నిబద్ధతను ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి హృదయపూర్వక కృతజ్ఞతలు.
ఎన్ టిఆర్ వైద్యసేవను హైబ్రిడ్ విధానంలోకి విస్తరించి, బీమా+పిఎంజెఎవై+డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్, ద్వారా మధ్యతరగతి కుటుంబాలకు రు.2.5 లక్షల ఆరోగ్య బీమా కవరేజీని మరియు పేద కుటుంబాలకు ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ ద్వారా రు.25 లక్షల వరకు ఉచిత చికిత్సలు అందించడమనేది మన రాష్ట్రంలో అందరికీ ఆరోగ్యం దిశగా ఒక చారిత్రాత్మక అడుగు. తద్వారా ఒక కోటి అరవై లక్షల కుటుంబాలకు పైగా లబ్ధి చేకూరనుంది. ఎన్ డిఎ ప్రభుత్వం ప్రజాహితం కొరకు తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రతి పౌరుడికీ ఆర్థిక భద్రత, నాణ్యమైన చికిత్స మరియు ఆరోగ్య సంరక్షణ అందనుంది. ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ మరింత బలోపేతం కానుంది. రాష్ట్రం “స్వర్ణాంధ్ర@2047 సాధన దిశగా మొదలైన ప్రయాణంలో ఇది ఇక ప్రభావవంతమైన అడుగు. ప్రజల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా.. రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రగా తీర్చిదిద్దేందుకు సిఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయం పట్ల హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను”. అని మంత్రి పేర్కొన్నారు. అలాగే అందరికీ డిజిటల్ హెల్త్ కార్డుల్ని ఇవ్వాలని ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించడాన్ని మంత్రి స్వాగతించారు.
Prajavartha Online Telugu News