-మూడు రోడ్ల అభివృద్ధికి రూ.9.86 కోట్ల నిధులు విడుదల చేసిన ప్రభుత్వం
మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త :
విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ చొరవతో మంగళగిరి నియోజకవర్గంలోని 3 రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం నుంచి నిధులు రూ. 9.86 కోట్లు మంజూరయ్యాయి. ఈ క్రమంలో త్వరలో పనులు మొదలుపెట్టనున్నారు. దుగ్గిరాల-కొల్లిపర్ర, ఉండవల్లి-యర్రబాలెం వయా పెనుమాక రోడ్డు, దుగ్గిరాల-పెదపాలెం రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం రూ. 9 కోట్ల 86 లక్షల నిధులు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కింద విడుదల చేసింది. గుంటూరు జిల్లాలోని దుగ్గిరాల-కొల్లిపర్ర మధ్య 4 కి.మీ రోడ్డు అభివృద్ధికి రూ. 2.86 కోట్లు కెటాయించడం జరిగింది. అదే విధంగా ఉండవల్లి-యర్రబాలెం వయా పెనుమాక రోడ్డుకు సంబంధించి 6.45 కి.మీ రోడ్డు అభివృద్ధికి రూ. 5 కోట్లు, దుగ్గిరాల-పెదపాలెం మధ్య 3 నుంచి 6.2 కి.మీ రోడ్డు అభివృద్ధికి 2 కోట్లు కెటాయించడం జరిగింది. ఈ నిధుల విడుదలతో మంగళగిరి నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధి శరవేగంగా జరగనుంది. మంత్రి నారా లోకేష్ చొరవతో ఇప్పటికే నియోకవర్గంలోని రోడ్లపై గుంతలు పూడ్చి ప్రయాణికుల కష్టలు తీర్చారు. తాజా నిధుల విడుదలతో ఆయా గ్రామాల మధ్య రోడ్ల అభివృద్ధి జరగనుంది. రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధిపై గత వైసీపీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేసింది. నిధుల కొరత పేరిట రోడ్ల వైపు కన్నెత్తి చూడకపోగా, రోడ్లు, భవనాల శాఖకు చెందిన స్థిరాస్తులను సైతం తాకట్టు పెట్టింది. అలాగే రోడ్ల సమస్యపై ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి ప్రజలు, ప్రజా సంఘాలు అనేకమార్లు తీసుకువెళ్లినప్పటికీ ఫలితం దక్కలేదు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టి కార్యచరణ మొదలు పెట్టింది.
Prajavartha Online Telugu News