-ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నిర్మాణానికి మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి శంకుస్థాపన
-నారా భువనేశ్వరి కి స్వాగతం పలికిన ఎంపి కేశినేని శివనాథ్ దంపతులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజాసేవే ధ్యేయంగా తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ ట్రస్ట్ ఎన్నో సేవ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఆ సేవలు ఎపి ప్రజలకు మరింత చేరువ చేసే లక్ష్యంతో విజయవాడలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ భవన్ నిర్మాణం చేపట్టడం సంతోషంగా వుందని ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) అన్నారు. విజయవాడ టీచర్స్ కాలనీలో గురువారం జరిగిన ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ భవన్ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) దంపతులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ భవన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు విచ్చేసిన ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి కి ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని), సతీమణి కేశినేని జానకి లక్ష్మీ పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు.
శంకుస్థాపన కార్యక్రమానికి ముందు నారా భువనేశ్వరి టీచర్ కాలనీలోని శ్రీ షిర్డి సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ భవన్ నిర్మాణానికి శంకుస్థాపన చేయటంతో పాటు శిలాపలకం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎంపి కేశినేని శివనాథ్ మాట్లాడుతూ హైదరాబాద్ నుంచి ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా చేపడుతున్న సేవా కార్యక్రమాలను ఎపి ప్రజలకు మరింత చేరవ చేసేందుకు విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ భవనం నిర్మాణం చేపడుతున్నందుకు నారా భువనేశ్వరికి ప్రజల తరుఫున ధన్యవాదాలు తెలిపారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన నిర్మాణం అమరావతి రాజధాని ప్రాంతమైన విజయవాడలో, తన పార్లమెంట్ నియోజకవర్గంలో జరగటం చాలా సంతోషంగా వుందన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవనం సిద్ధమైతే పేద విద్యార్థులకు విద్య, పేదలకు వైద్య సౌకర్యాలతో పాటు తలసేమియా కేర్ సెంటర్, బ్లడ్ బ్యాంక్ కూడా అందుబాటులోకి వస్తాయన్నారు. ప్రజలే దేవుళ్లు సమాజమే దేవాలయమన్న తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు స్పూర్తితో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా నారా భువనేశ్వరి ఎన్టీఆర్ ట్రస్ట్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నారని కొనియడారు.
Prajavartha Online Telugu News