– సమగ్ర సస్యరక్షణ పద్ధతులతో పంటకు రక్ష
– బ్రోమోడయోలోన్ ఎరను రైతులు ఉచితంగా పొందొచ్చు
– సమగ్ర ఎలుకల యాజమాన్యం (రబీ 2025) పోస్టర్లను ఆవిష్కరించిన కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల 11వ తేదీన జిల్లాలోని వరిసాగుచేసే గ్రామాల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సామూహిక ఎలుకల నిర్మూలన కార్యక్రమం జరుగుతుందని.. ఎలుకల నిర్మూలనతో పంటకు రక్షణ లభిస్తుందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సమగ్ర ఎలుకల యాజమాన్యం (రబీ 2025)పై రూపొందించిన ప్రత్యేక పోస్టర్లను సోమవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్ లక్ష్మీశ.. వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పొలాలు, గట్లపై సజీవ ఎలుక బొరియలను గుర్తించి, వాటిలో బ్రోమోడయోలోన్ మందు కలిపిన ఎరను 10 గ్రాములు చొప్పున వేసి మూసేయాల్సి ఉంటుందని వివరించారు. బ్రోమోడయోలోన్ ఎలుకల మందు కలిపిన ఎరను రైతులు గ్రామ వ్యవసాయ సహాయకుల (వీఏఏ) నుంచి ఉచితంగా పొందొచ్చన్నారు. పంటను కాపాడుకోవాలంటే ఒకేసారి అన్ని పొలాల్లోనూ సామూహిక ఎలుకల నిర్మూలన జరగాలన్నారు. ఆహార ధాన్యాల ఉత్పత్తి, నిల్వల్లో రైతులకు ప్రథమ శత్రువులు ఎలుకలని.. విత్తింది మొదలు కోత వరకు ఎలుకలు వరి పంటపై దాడిచేసి నష్టం కలిగిస్తాయని.. ఈ నేపథ్యంలో వరిపైరులో వివిధ దశల్లో ఎలుకలు కలుగజేసే నష్టం తీరుతెన్నులపై అవగాహన ఏర్పరచుకొని, ప్రణాళిక ప్రకారం సమగ్ర నివారణ చర్యలు చేపట్టడంలో రైతులను ప్రభుత్వం చేయిపట్టి నడిపిస్తోందని తెలిపారు. ఎలుకలను సమర్థవంతంగా నిర్మూలించేందుకు సమగ్ర సస్యరక్షణ పద్ధతులు పాటించడంలో ప్రభుత్వ చొరవను అన్నదాతలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు.
కార్యక్రమంలో డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, జిల్లా వ్యవసాయ అధికారి డీఎంఎఫ్ విజయకుమారి, డీఆర్డీఏ పీడీ కె.శ్రీనివాసరావు, జిల్లా పశుసంవర్థక అధికారి డా. ఎం.హనుమంతరావు, గ్రామ వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి జి.జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News