గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరధిలోని గోరంట్ల అన్నపూర్ణ నగర్ లో తీవ్రంగా ఉన్న పారిశుధ్య, డ్రైనేజి సమస్యలను యుద్దప్రాతిపదికన పరిష్కరించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఇంజినీరింగ్ అధికారులకు స్పష్టం చేశారు. మంగళవారం కమిషనర్ అన్నపూర్ణ నగర్, నగరాలు, గోరంట్ల, ఎస్వీఎన్ కాలనీ తదితర ప్రాంతాల్లో పర్యటించి, అభివృద్ధి, పారిశుధ్య పనులను పరిశీలించి సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా అన్నపూర్ణ నగర్లో స్థానికుల ఫిర్యాదు మేరకు పరిశీలించి, కమిషనర్ మాట్లాడుతూ సదరు ప్రాంతంలో డ్రైనేజి సమస్య తీవ్రంగా ఉండి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. తక్షణం మురుగునీటిని బెయిల్ అవుట్ చేయాలని ఏఈని ఆదేశించారు. అనంతరం పరిసరాలను పరిశీలించి నూతన డ్రైన్, రోడ్ నిర్మాణ పనులు మంజూరు అయినందున పనులను ప్రారంభించాలని ఆదేశించారు. డ్రైన్ నిర్మాణంకు ఫాల్ ఉన్న ప్రాంతంవైపు సర్వే చేయించాలని పట్టణ ప్రణాళికాధికారులను ఆదేశించారు. అలాగే చిల్లీస్ జంక్షన్ వైపు నుండి రైల్వే గేటు వైపు అవుట్ ఫాల్ డ్రైన్ నిర్మాణం చేయాల్సి ఉన్నందున అంచనాలు సిద్దం చేయాలన్నారు. ఎస్వీఎన్ కాలనీలో పలు బహుళ అంతస్తు భవనాలు రోడ్ల మీదకు ర్యాంప్ లు నిర్మాణం చేయడం గమనించి, ట్రాఫిక్ కి అవరోధంగా ఉన్నందున వాటిని తొలగించాలని పట్టణ ప్రణాళిక అధికారులను, సదరు ప్రాంతంలో రోడ్ మీద ఉన్న చెట్టును నరికిస్తున్న ఇంటి యజమానిపై ఆగ్రహం వ్యక్తం చేసి, ప్రస్తుతం కాలంలో చెట్లు చాలా అవసరమని, చెట్లను నరికించడం చట్టరీత్యా నేరమన్నారు. పలు ప్రాంతాల్లో రోడ్ల వెంబడి డెబ్రిస్ ఉన్నాయని, వాటిని తొలగించాలని ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు.
పర్యటనలో కార్పొరేటర్ డిఈఈ రమేష్ బాబు, ఎస్ఎస్ సోమశేఖర్, ఏసిపిలు రెహ్మాన్, మల్లిఖార్జున, టిపిఎస్ సత్యనారాయణ, ఏఈ చైతన్య, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News