విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో ఇంధన రంగంలో తీసుకురానున్న వ్యూహాత్మక రోడ్మ్యాప్పై నీతి ఆయోగ్ ప్రతినిధి బృందం శుక్రవారం విజయవాడలోని సిఎస్ క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ తో భేటీ అయింది.ఈసమావేశంలో ముఖ్యంగా ఖర్చు-సమర్థవంతమైన ఇంధన పరివర్తన కోసం వ్యూహాత్మక రోడ్మ్యాప్ రూప కల్పనకు తీసుకోవాల్సిన అంశాలపై చర్చించారు.ఈసందర్భంగా సిఎస్ విజయానంద్ మాట్లాడుతూ 2047 నాటికి రాష్ట్రంలో నికర సున్నా లక్ష్యాలను(Net Zero targets)సాధించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను నీతి ఆయోగ్ ప్రతినిధి బృందానికి వివరించారు.ముఖ్యంగా 2024 ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ కింద 160 గిగావాట్ల(GW)కు మించి పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని నెలకొల్పేందుకు లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధికి పెద్దఎత్తున చర్యలు తీసుకుంటోందని దానిలో భాగంగా సోలార్,విండ్ విద్యుత్ ఉత్పత్తి మరియు గ్రీన్ హైడ్రోజన్ విద్యుత్ ఉత్పత్తి రంగాల్లో పెద్దఎత్తున పెట్టుబడులు ఆకర్షించి పలు ప్రాజెక్టులు నెలకొల్పేందుకు కృషి చేస్తున్నట్టు సిఎస్ వివరించారు.
ఇటీవల విశాఖపట్నం సమీపంలో ఎన్టిపిసి మరియు ఎన్ఆర్ఇడిసిఎపి జెవి(NREDCAP JV) లచే ఇంటిగ్రేటెడ్ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి ప్రాజెక్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడి వారి చేతుల మీదగా శంఖుస్థాపన చేసుకోవడం జరిగిందని సిఎస్ విజయానంద్ నీతి ఆయోగ్ బృందానికి వివరించారు.అలాగే కాకినాడలో గ్రీన్కో గ్రూప్ చే గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి & ఎలక్ట్రోలైజర్ తయారీ, ఎపి జెన్కో సొంతంగా మరియు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ NHPC తో JV ద్వారా 6,000 MW సామర్ధ్యానికి మించి పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు(PSPs) మరియు ఇతర పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులు అభివృద్ధిలో ఉన్నాయని సిఎస్ విజయానంద్ నీతి ఆయోగ్ బృందానికి తెలిపారు.
ఇంధన పరివర్తన ప్రణాళిక కింద మహారాష్ట్ర ప్రభుత్వానికి నీతి ఆయోగ్ అందిస్తున్న సేవలు మరియు ఆరాష్ట్రం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను నీతి ఆయోగ్ బృందం సీఎస్ కు వివరించింది.ఇంధన పరివర్తన ప్రణాళిక కింద మహారాష్ట్ర ప్రభుత్వం ఎనర్జీ ట్రాన్సిషన్ ప్రణాళిక కింద నికర సున్నా లక్ష్య సాధనకు తీసుకుంటున్న చర్యలను నీతి ఆయోగ్ బృందం సిఎస్ కు వివరించింది.ఖర్చు-సమర్థవంతమైన ఇంధన పరివర్తనను సాధించడంలో ఆంధ్రప్రదేశ్కు ఉన్న అవకాశాలను అందుకు మద్దతు ఇవ్వడానికి నీతి ఆయోగ్ ముందుకు వచ్చింది.
అదే విధంగా 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెట్ జీరో లక్ష్య సాధనకు చేరుకోవడానికి మరియు వ్యయ-సమర్థవంతమైన ఇంధన పరివర్తనను(Cost-Effective Energy Transition) సాధించడంలో రాష్ట్రానికి పూర్తి మద్దతు ఇచ్చేందుకు సంబంధించి నీతి ఆయోగ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒక అవగాహన ఒప్పందం(ఎంఓయు)కుదుర్చుకునేందుకు నీతి ఆయోగ్ ముందుకు వచ్చింది.
ఈ సమావేశంలో సిఎండి ఎపి ఇపిడిసిఎల్ ఐ పృధ్వీతేజ్,సిఎండి ఎస్పిడిసిఎల్ కె.సంతోషరావు,సిఎండి సిపిడిసిఎల్ ఎకెవి భాస్కర్ లతో పాటు నీతి ఆయోగ్ ప్రతినిధి బృందం అన్షు భరద్వాజ్,శిరీష్ సాంఖే(Sirish Sankhe)సుశ్రుత్ హెల్వాత్కర్(Sushrut Helwatkar), దీపక్ బవారీ,రోన్ని ఖన్నా,కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News