-ఆగస్టు 7 వ తేదీ వరకు ఆన్ లైన్ దరఖాస్తు పొడిగింపు
-ఏపీ మైనారిటీ సంక్షేమ, న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
హజ్ యాత్ర కోసం హజ్ కమిటీ ఆఫ్ ఇండియా హజ్-2026 కు ఆన్లైన్ దరఖాస్తు నమోదు గడువు ను ఆగస్టు 7 వ తేదీ వరకు పొడిగించినట్లు రాష్ట్ర మైనారిటీ సంక్షేమ, న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అమరావతిలో గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.హజ్ యాత్ర కోసం దరఖాస్తులు అన్నీ ఆన్లైన్ ద్వారా మాత్రమే స్వీకరించడం కోసం కేంద్రహజ్ కమిటీ దేశవ్యాప్త ప్రకటన చేయడం జరిగిందని తెలిపారు.హజ్ దరఖాస్తుల ఫారమ్లను పూరించడానికి కేంద్ర హజ్ కమిటీ మొదట జులై 31వ తేదీ వరకు గడువు నిర్ణయించిందన్నారు.
హజ్ కు వెళ్లాలనుకొని గడువులోగా ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను పూరించని ఆంధ్రప్రదేశ్ కు చెందిన యాత్రికులంతా ఆగష్టు 7వ తేదీ వరకు గడువు పెంపు సౌలభ్యంతో విజయవాడ ఎంబార్కేషన్ సెంటర్ ను మొదటి ప్రాధాన్యతగా ఎంచుకొని దరఖాస్తు చేసుకోవాలని మంత్రి కోరారు. ముఖ్యంగా ఇప్పటికే హజ్ -2026 కు దరఖాస్తు చేసుకున్న యాత్రికులందరూ కూడా ఎంబార్కేషన్ కేంద్రాల ప్రాధాన్యతలో మార్పు చేసుకుని విజయవాడ ఎంబార్కేషన్ కేంద్రాన్ని మొదటి ప్రాధాన్యతగా ఎంచుకోవాలని సూచించారు. విజయవాడ ఎంబార్కేషన్ కేంద్రం నుంచి హజ్ కు వెళ్లే యాత్రికులకు కూటమి ప్రభుత్వం మంజూరు చేసే రూ. లక్ష ఆర్థిక సాయాన్ని యాత్రికులు సద్వినియోగం చేసుకునేందుకు వీలుగా విజయవాడ కేంద్రం కు మొదటి ప్రాధాన్యత ఇచ్చి హజ్ యాత్రికులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని మంత్రి కోరారు. ఇకపైన గడువు పొడిగింపు ఉండదని, అందువల్ల హజ్ 2026 చేయదలచుకున్నవారు త్వరపడాలని మైనారిటీ సంక్షేమ, న్యాయ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ సూచించారు.
Prajavartha Online Telugu News