మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
యూరియా సక్రమంగా రైతులకు పంపిణీ చేయాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ పక్కదారి పట్టకూడదని జిల్లా సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మ ఎరువుల డీలర్లను ఆదేశించారు. సోమవారం మధ్యాహ్నం సంయుక్త కలెక్టర్ ఉయ్యూరు ఆర్డిఓ బిఎస్ హేలా షారోన్, గన్నవరం డిఎస్పి సి హెచ్ శ్రీనివాసరావు తో కలిసి సంయుక్తంగా పెనమలూరులోని రైతు మిత్ర ఆగ్రో ట్రేడర్స్, పెనమలూరు ఫర్టిలైజర్స్ అనే రెండు ఎరువుల దుకాణాలను, గోదాములను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సంయుక్త కలెక్టర్ ఎరువుల దుకాణంలోని యూరియా తదితర ఎరువుల పంపిణీ రికార్డులను, గోదాముల్లో స్టాకు స్థితిగతులను పరిశీలించి వివరాలను సంబంధిత డీలర్ల ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంయుక్త కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు కావలసినంత యూరియాను సరఫరా చేస్తుందని, యూరియా కొరతను కృత్రిమంగా సృష్టించవద్దని సంయుక్త కలెక్టర్ డీలర్లకు సూచించారు. యూరియాను అధిక ధరలకు విక్రయించిన, పక్కదారి పట్టించిన చట్టరీత్యా క్రిమినల్ చర్యలు చేపడతామని హెచ్చరించారు. యూరియాకు మరో ఎరువు జత చేసి అమ్మరాదని స్పష్టం చేశారు. నానో ఎరువుల వాడకాన్ని రైతులకు తెలియజేసి ప్రోత్సహించాలన్నారు. ఈ తనిఖీలో సంయుక్త కలెక్టర్ గన్నవరం వ్యవసాయ సహాయ సంచాలకులు సునీల్, మండల వ్యవసాయ అధికారి శైలజ, తహసిల్దార్ గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News