-అభ్యర్థులు పరీక్ష సమయానికి ముందుగానే హాజరు కావాలి…
-నగరంలో నాలుగు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు…
-పరీక్షకు హాజరు కానున్న 1608 మంది అభ్యర్థులు…
-కోవిడ్-19 మార్గదర్శకాలు అనుసరిస్తూ పరీక్ష ఏర్పాట్లు…
-జిల్లా కలెక్టర్ జె.నివాస్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో సెప్టెంబరు 5వ తేది ఆదివారం యుపిఎసి ఆధ్వర్యంలో నిర్వహించే పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
నగరంలోని కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో గురువారం ఎంప్లాయిస్ ప్రోవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్లో ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్స్, అకౌంట్స్ ఆఫీసర్ల ఉద్యోగ నియమాకల కోసం సెప్టెంబరు 5న యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే పరీక్ష ఏర్పాట్లపై రెవెన్యూ, పోలీస్, ఉన్నత విద్యాశాఖ, పోస్టర్ శాఖ, విద్యుత్, వైద్య తదితర శాఖ అధికారులతో కలెక్టర్ జె.నివాస్ సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యుపిఎస్సీ పరీక్షలు ఎంతో ప్రతిష్టాత్మకమైనవని ఈ పరీక్షల నిర్వహణలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా పకడ్బంది ఏర్పాట్లు చేయాలన్నారు. కోవిడ్ నియమనిబంధనలను పాటిస్తూ సెప్టెంబరు 5వ తేది ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ఈ పరీక్షలు నిర్వహించబడతాయన్నారు. అభ్యర్థులు పరీక్షలు రాసేందుకు తప్పనిసరిగా బ్లాక్ పాయింట్ పెన్ తెచ్చుకోవాలన్నారు. వర్షాలను దృష్టిలో వుంచుకుని పరీక్ష కేంద్రాల వద్ద తగిన ఏర్పాటు చేయాలన్నారు. ప్రధానంగా ప్రశ్నాపత్రాలు తెరిచేటప్పుడు, అభ్యర్థులకు పంపిణీ చేసే సమయంలో తగు మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విజయవాడలోని పిబి సిద్ధార్థ కళాశాల (ఆర్ట్స్ అండ్ సైన్స్) లబ్బిపేటలోని శ్రీ దుర్గామల్లేశ్వర సిద్ధార్థ మహిళ కళాశాల, మెరీస్ స్టేల్లా కళాశాల, పటమట శ్రీ కృష్ణావేణి ఇంగ్లీషు మీడియం హైస్కూల్ లోను పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తాం అన్నారు. ఈ పరీక్షలకు 1608 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కానున్నారన్నారు. పరీక్షల నిర్వహణకు ఆరుగురు లోకల్ ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్లను నియమించామన్నారు. 14 మందిని ఆసిస్టెంట్ సూపర్వైజర్లుగా, 167 మందిని ఇన్విజిలేటర్లుగా నియమించడం జరిగిందన్నారు. పరీక్షా కేంద్రం వద్ద కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. అందుకు అవసరమైన ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఒక్కొక్క పరీక్ష హాల్లో 24 మంది అభ్యర్థులు పరీక్షలు రాసేందుకు ఏర్పాటు చేయాలన్నారు. పరీక్ష కేంద్రం వద్ద శానిటైజర్లు ఏర్పాటు చేయాలన్నారు. అందరూ తప్పనిసరిగా మాస్క్ ధరించేలా చూడాలన్నారు. పరీక్ష హాల్లో ఇన్విజిలేటర్లు, పరీక్ష కేంద్రం బయట ఇన్ స్పెక్టింగ్ ఆఫీసర్లు తదితరులు వుంటరన్నారు. అభ్యర్థుల మొబైల్ ఫోన్లను భద్రపరిచేందుకు టోకెన్లు తయారు చేసుకోవాని ఆయన చెప్పారు. పరీక్ష వ్రాసే అభ్యర్థులకు ఎటువంటి అసౌకర్యం కలకుండా పరీక్షా కేంద్రాల్లో త్రాగురు, మరుగుదొడ్లు అందుబాటులో ఉండాలని నిరంతరం విద్యుత్తు సరఫరా ఉండాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ జె. నివాస్ ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ డా.కె. మాధవిలత, విజయవాడ సబ్ కలెక్టర్ జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్, డిఆర్వో యం. వెంకటేశ్వర్లు, ఏఓ వి. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.