– సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అమెరికాలోన న్యూయార్క్ నగర మేయర్గా డెమోక్రటిక్ పార్టీకి చెందిన జొహ్రాన్ మమ్దానీ గెలుపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు గొడ్డలిపెట్టు అని సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ వ్యాఖ్యానించారు. ఈ మేరకు కె రామకృష్ణ నేడు ఒక ప్రకటన విడుదల చేశారు. అమెరికా స్థానిక ఎన్నికల్లో ఫలితాలు అమెరికాలోని అధికార రిపబ్లికన్ పార్టీకి, ముఖ్యంగా ట్రంప్కు షాకిచ్చాయి. ఈ ఎన్నికల్లో అత్యంత కీలకంగా మారిన న్యూయార్క్ నగర మేయర్ పదవిని డెమోక్రటిక్ పార్టీకి చెందిన 34 ఏళ్ల జొహ్రాన్ మమ్దానీ కైవసం చేసుకున్నారు. భారతీయ మూలాలున్న జొహ్రాన్ ఓటమి కోసం ట్రంప్ స్వయంగా రంగంలోకి దిగడంతో ఈ ఎన్నికకు ప్రాముఖ్యత సంతరించుకుంది. ఎన్నికలకు ముందు ‘‘కమ్యూనిస్టు భావజాలం కలిగిన జొహ్రాన్ మమ్దానీ న్యూయార్క్ మేయర్గా గెలిస్తే, న్యూయార్క్ సిటీకి ఫెడరల్ సాయం అందదని’’ అని ట్రంప్ సోషల్ మీడియా పోస్టులో పేర్కొంటూ చేసిన ట్రంప్ వ్యాఖ్యలు ఆయన అహంకారానికి అద్దంపడుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎత్తులను చిత్తు చేస్తూ గెలిచి చరిత్ర సృష్టించిన జొహ్రాన్ మమ్దానీకి అభినందనలు. ఆయన విజయం ట్రంప్ అనాలోచిత విధానాలకు, పాలనకు గట్టి ఎదురుదెబ్బ. ఈ ఎన్నికల్లో జొహ్రాన్ను అడ్డుకునేందుకు రిపబ్లికన్ నేతలు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించకపోవడం ట్రంప్ ఏకపక్ష, నిరంకుశ విధానాలకు గొడ్డలిపెట్టు అని అన్నారు.
Prajavartha Online Telugu News