-అంత్యోదయమే బిజెపి లక్ష్యం : పీవీఎన్ మాధవ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న “పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్”లో భాగంగా శనివారం కృష్ణా జిల్లా ప్రశిక్షణ వర్గ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు PVN Madhavముఖ్య అతిథిగా పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ ప్రతిపాదించిన “అంత్యోదయ” తత్వం భారతీయ జనతా పార్టీ ఆలోచనా విధానానికి మూల స్ఫూర్తిగా నిలిచిందన్నారు. సమాజంలోని చివరి వ్యక్తి అభ్యున్నతే లక్ష్యంగా రాజకీయాలు ఉండాలని, అదే నిజమైన ప్రజాసేవ అని పేర్కొన్నారు. జాతీయవాద భావజాలంతో దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని, దేశం ముందు – పార్టీ తర్వాత – వ్యక్తి చివర అనే సిద్ధాంతంతో ప్రతి కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు.
పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కార్యకర్తల పాత్ర అత్యంత కీలకమని ఆయన తెలిపారు. సేవా భావంతో ప్రజల మధ్య నిరంతరం పనిచేసే కార్యకర్తలే బిజెపికి అసలైన బలమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను గ్రామ స్థాయికి తీసుకెళ్లి ప్రజలకు చేరువ చేయాలని సూచించారు.
ప్రశిక్షణ వర్గ్ల ద్వారా కార్యకర్తల్లో సిద్ధాంతపరమైన అవగాహన, నాయకత్వ లక్షణాలు, ప్రజాసేవా దృక్పథం మరింత బలోపేతం అవుతాయని పీవీఎన్ మాధవ్ పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు, బిజెపి ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News