గుంటూరు , నేటి పత్రిక ప్రజావార్త :
“పరిశుభ్రమైన ఆంధ్రప్రదేశ్ మన అందరి బాధ్యత” అనే నినాదంతో నగరంలో పారిశుద్ధ్య రంగాన్ని పటిష్టం చేసేందుకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “ఆపరేషన్ క్లీన్ స్వీప్” కార్యక్రమం విజయవంతంగా 3వ వారంలోకి అడుగుపెట్టిందని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 8వ తేదీ నుండి 13వ తేదీ వరకు జరిగే ఈ మూడవ వారపు ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్లో భాగంగా నగరాన్ని మరింత పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు ఒక ప్రత్యేక రోజువారీ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని ప్రతి ఒక్కరూ నగర స్వచ్చతకు సహకరించాలని, ముఖ్యంగా ఇళ్లు, వ్యాపార, వాణిజ్య సంస్థల నుండి సేకరించే వ్యర్థాలను పారిశుధ్య సిబ్బందికి అప్పగించే ముందే తడి వ్యర్థాలు, పొడి వ్యర్థాలు, శానిటరీ మరియు ప్రత్యేక వ్యర్థాలుగా విడివిడిగా వేరు చేసి అందించాలని స్పష్టం చేశారు. సోర్స్ దగ్గరే వ్యర్థాల విభజన జరగడం ద్వారా నగర పారిశుద్ధ్య నిర్వహణ మరింత తేలికవుతుందాని తెలిపారు. నగరంలోని హోటళ్లు, కళాశాలలు, విద్యాసంస్థలు, పెద్ద అపార్ట్మెంట్లు తప్పనిసరిగా ‘బల్క్ వేస్ట్ జనరేటర్’ నిబంధనలను పాటించాలని స్పష్టం చేశారు. ఎక్కువ మొత్తంలో వ్యర్థాలను ఉత్పత్తి చేసే ఇటువంటి సంస్థలు తమ ప్రాంగణాల్లో ఉత్పత్తయ్యే చెత్తను శాస్త్రీయంగా నిర్వహించుకోవాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ వారంలో వీటిపై ప్రత్యేక నిఘా మరియు క్షేత్రస్థాయి తనిఖీలు ఉంటాయని స్పష్టం చేశారు. ఈ ఆపరేషన్ క్లీన్ స్వీప్ 3వ వారపు రోజువారీ షెడ్యూల్లో భాగంగా ఉదయం పూట మరియు మధ్యాహ్నం పూట నిర్దిష్టమైన కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. దీని ప్రకారం ప్రతిరోజూ ఉదయం వేళల్లో ఇంటింటికీ వెళ్ళి వ్యర్థాల సేకరణ ప్రక్రియను నిశితంగా పరిశీలించడంతో పాటు, బల్క్ వేస్ట్ జనరేటర్ల నిబంధనల అమలును క్షేత్రస్థాయిలో ధృవీకరిస్తారు. అలాగే వాణిజ్య, వ్యాపార సముదాయాల ప్రాంతాలలో ముమ్మరంగా పారిశుధ్య పనులు చేపడతారని, చెత్తను విడివిడిగా వేరు చేయడంపై ప్రజల్లో అవగాహన సదస్సులు నిర్వహించడంతో పాటు, ప్రధాన మార్కెట్ ప్రాంతాలలో ప్రత్యేక శుభ్రతా కార్యక్రమాలు చేపడతారన్నారు. నిబంధనలు పాటించని బల్క్ జనరేటర్లకు నోటీసులు జారీ చేయడం, వారు నిబంధనలకు సమ్మతించేలా అవగాహన కల్గిస్తామని తెలిపారు. అపార్ట్మెంట్లలో పారిశుద్ధ్య పరిస్థితులపై తనిఖీలు నిర్వహించి, హోటళ్లు, చికెన్, మటన్, చేపల మార్కెట్లలో వ్యర్థాల నిర్వహణను నిరంతరం పర్యవేక్షిస్తారన్నారు. నగరంలోని వివిధ కాలనీలు, కమ్యూనిటీలలో పరిశుభ్రతపై విస్తృత అవగాహన కల్పించడంతో పాటు, సెకండరీ కలెక్షన్ పాయింట్స్ వద్ద తక్షణ శుభ్రతా పనులు చేపడతారన్నారు. చెత్త రవాణా చేసే వాహనాల కదలికలు మరియు వాటి నిర్వహణను పర్యవేక్షిస్తూ, బహిరంగ ప్రదేశాలలో చెత్త వేసే వారిపై మరియు వ్యర్థాలను తగులబెట్టే వారిపై జరిమానాలు విధించేలా కఠినమైన చర్యలు అమలు చేయాలని ప్రజారోగ్య అధికారులు ప్రత్యేక ఆదేశాలు ఇచ్చామని తెలిపారు.
నగర ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, వర్తక సంఘాల ప్రతినిధులు ఈ ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ లో భాగస్వాములు కావాలని కోరారు. నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపై చెత్త వేసే వారిపై ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’ లో భాగంగా జరిమానాలు విధించడం జరుగుతుందని తెలిపారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోవచ్చని, స్వచ్ఛమైన మరియు ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆకాంక్షించారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకుందాం – స్వచ్ఛ ఆంధ్రను నిర్మిద్దాం అని పిలుపునిచ్చారు.
Prajavartha Online Telugu News