-పార్లమెంటులో తిరుపతి ఎంపీ గురుమూర్తి ప్రశ్న
న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశంలో కర్బన ఉద్గారాలను తగ్గించి పరిశ్రమలను పర్యావరణహితంగా తీర్చిదిద్దేందుకు కార్బన్ క్యాప్చర్, యుటిలైజేషన్ అండ్ స్టోరేజ్ టెక్నాలజీల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం వచ్చే ఐదేళ్లలో రూ.20 వేల కోట్ల ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేసేందుకు తెలిపింది. ఈ విషయాన్ని పార్లమెంట్లో తిరుపతి ఎంపీ గురుమూర్తి అడిగిన ప్రశ్నకు కేంద్ర విద్యుత్ శాఖ సహాయ మంత్రి శ్రీపాద నాయక్ లిఖితపూర్వక సమాధానంలో వెల్లడించారు.
కేంద్ర ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం, 2026-27 కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన ఈ కార్యక్రమం ద్వారా విద్యుత్, ఉక్కు, సిమెంట్, రిఫైనరీలు, రసాయన పరిశ్రమలు వంటి అధిక కర్బన ఉద్గారాలు వెలువరించే ఐదు ప్రధాన రంగాల్లో కార్బన్ క్యాప్చర్ టెక్నాలజీలను ప్రోత్సహించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ కార్యక్రమం రూపకల్పన దశలో ఉందని, దీనికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన తర్వాత అమలుకు సంబంధించిన పూర్తి మార్గదర్శకాలను రూపొందిస్తామని పేర్కొన్నారు.
ఈ మార్గదర్శకాల్లో ప్రాజెక్టుల ఎంపిక ప్రమాణాలు, మానిటరింగ్, రిపోర్టింగ్, వెరిఫికేషన్ విధానం, స్వతంత్ర ఆడిట్ నిబంధనలు, ప్రజలకు సమాచారం వెల్లడించే విధానం, కర్బన ఉద్గారాల తగ్గింపును అంచనా వేసే పద్ధతులు వంటి అంశాలను రూపొందించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్బంగా ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించడంలో కార్బన్ క్యాప్చర్, యుటిలైజేషన్ అండ్ స్టోరేజ్ టెక్నాలజీలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. కర్బన ఉద్గారాల తగ్గింపును శాస్త్రీయంగా అంచనా వేసే వ్యవస్థలు తప్పనిసరిగా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. విద్యుత్, ఉక్కు, సిమెంట్, రిఫైనరీలు, రసాయన పరిశ్రమలు వంటి అధిక కర్బన ఉద్గారాలు వెలువరించే రంగాల్లో ఈ సాంకేతికతను సమర్థవంతంగా అమలు చేస్తే పర్యావరణ పరిరక్షణతో పాటు దేశం నెట్-జీరో లక్ష్యాల సాధనకు దోహదపడుతుందని ఆయన అన్నారు.
Prajavartha Online Telugu News