-కేంద్ర పాఠశాల విద్యా కార్యదర్శిని కోరిన తిరుపతి ఎంపీ గురుమూర్తి
న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి జిల్లాలో జవహర్ నవోదయ విద్యాలయం ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేసి, నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని తిరుపతి ఎంపీ శ్రీ మద్దిల గురుమూర్తి కేంద్ర విద్యాశాఖ కార్యదర్శిని కలిసి విజ్ఞప్తి చేశారు. ఇటీవల పార్లమెంట్ జీరో అవర్లో ఈ అంశాన్ని ప్రస్తావించిన ఎంపీ గురుమూర్తి, తిరుపతి జిల్లాలో జవహర్ నవోదయ విద్యాలయం ఏర్పాటుకు అవసరమైన భూమిని ఇప్పటికే గుర్తించినప్పటికీ నిర్మాణ పనులు ప్రారంభం కాకపోవడంతో విద్యార్థులు నాణ్యమైన రెసిడెన్షియల్ విద్యకు దూరమవుతున్నారని ఆయనకి వివరించారు.
గ్రామీణ ప్రాంతాలు, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు జవహర్ నవోదయ విద్యాలయాలు ఎంతో ఉపయోగకరమని, తిరుపతి జిల్లాలో ఈ విద్యాసంస్థ ఏర్పాటుతో వేలాది మంది విద్యార్థులు నాణ్యమైన ఉచిత విద్యను పొందే అవకాశం కలుగుతుందని తెలిపారు. ఈ నేపథ్యంలో జవహర్ నవోదయ విద్యాలయం నిర్మాణానికి అవసరమైన పరిపాలనా అనుమతులు, నిధుల కేటాయింపు ప్రక్రియను వేగవంతం చేసి, నిర్మాణ పనులను వీలైనంత త్వరగా ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర పాఠశాల విద్యా కార్యదర్శిని ఎంపీ గురుమూర్తి కోరారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లాకు జవహర్ నవోదయ విద్యాలయం త్వరితగతిన అందుబాటులోకి వచ్చేలా చర్యలు చేపడతామని అధికారులు ఎంపీకి హామీ ఇచ్చినట్లు ఎంపీ తెలిపారు.
Prajavartha Online Telugu News