గిరిజన గ్రామాలు… అడవి తల్లి బాటలు

-ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిరంతర పర్యవేక్షణలో రహదారి పనుల్లో స్పష్టమైన పురోగతి
-అడవితల్లి బాట తొలి దశలో రూ. 1,005 కోట్లతో 1,069 కి.మీ. రహదారుల అభివృద్ధికి శ్రీకారం
-అడవితల్లి బాట 2.0 విస్తరణతో మొత్తం రూ. 2,078 కోట్లతో 2,310 కి.మీ. రహదారుల అభివృద్ధి
-విస్తరణ పనుల్లో ఇప్పటికే 905 కి.మీ. రహదారుల నిర్మాణం పూర్తి
-పెండింగ్ పనులపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో సమీక్షించిన ఉపముఖ్యమంత్రి
-మిగిలిన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశం
-అటవీ అనుమతులు జాప్యం లేకుండా సమన్వయం చేసుకోవాలి
-వర్షాల వల్ల ఆటంకాలు ఉన్న రోడ్లు మినహా మిగిలిన పనులు కొనసాగించాలి
-డోలీ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంలో ప్రతి ఒక్కరు భాగస్వాములవ్వాలని పిలుపు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పవన్ కళ్యాణ్  పర్యవేక్షణలో డోలీరహిత గిరిజన గ్రామాలు లక్ష్యంగా చేపట్టిన అడవితల్లి బాట పనులు స్పష్టమైన పురోగతి దిశగా సాగుతున్నాయి. అడవితల్లి బాట తొలి దశలో రూ. 1,005 కోట్ల అంచనా వ్యయంతో 1,069 కిలోమీటర్ల మేర రహదారుల అభివృద్ధికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మరింత విస్తరిస్తూ అడవితల్లిబాట 2.0ను ప్రారంభించడం జరిగింది. ఈ విస్తరణతో మొత్తం ప్రాజెక్టును రూ. 2,078 కోట్ల అంచనా వ్యయంతో 2,310 కిలోమీటర్ల మేర రహదారుల అభివృద్ధికి విస్తరించడం జరిగింది. ఇందులో ఇప్పటికే 905 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణం పూర్తైంది. అడవితల్లిబాట కార్యక్రమం మొదటి రోజు నుంచి పనుల పురోగతిపై సంబంధిత శాఖల అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, పనులు వేగంగా ముందుకు తీసుకువెళ్లే విధంగా పవన్ కళ్యాణ్ సూచనలు చేస్తున్నారు.

సవాళ్ల నడుమ రోడ్డు నిర్మాణం
అడవితల్లిబాట కార్యక్రమంలో భాగంగా చాలా గ్రామాలకు రోడ్డు వేయడం కంటే ముందు దారి నిర్మించేందుకు సంక్లిష్ట పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది. రోడ్ల నిర్మాణంలో భాగంగా పెద్ద పెద్ద గుట్టలను కంట్రోల్డ్ బ్లాస్టింగ్ ద్వారా బ్రేక్ చేసి, రాళ్లు పగలగొట్టి దారి ఏర్పాటు చేశారు. ఆ దారిపై రోడ్ల నిర్మాణం చేపడుతున్నారు. దారులు వేసిన తర్వాత కొన్ని ప్రాంతాలకు వాతావరణ పరిస్థితులు అనుకూలించక నిర్మాణ సామాగ్రి చేరుకోవడం కష్టతరంగా మారింది. అలాంటి సవాళ్ల మధ్య గిరిశిఖర గ్రామాలకు సైతం డోలీ కష్టాల నుంచి విముక్తి కల్పించాలన్న దృఢ సంకల్పంతో ఉప ముఖ్యమంత్రివర్యుల ప్రణాళికలు ముందుకు తీసుకువెళ్తున్నారు.

* ప్రతి గిరిజన గ్రామం డోలీ రహితం కావాలి : పవన్ కళ్యాణ్
అడవితల్లిబాట పనుల పురోగతిపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో సమీక్షించిన పవన్ కళ్యాణ్ నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా పెండింగ్ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అటవీ అనుమతుల ప్రక్రియలో జాప్యం లేకుండా ఆయా జిల్లాల కలెక్టర్లు శాఖల మధ్య సమన్వయ బాధ్యత తీసుకుని త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రికార్డు స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలకు అటవీ అనుమతుల ప్రక్రియ పూర్తి చేసిన విషయాన్ని గుర్తు చేశారు. వర్షాల కారణంగా పనులకు ఆటంకాలు ఏర్పడిన ప్రాంతాలు మినహా, మిగిలిన అన్ని ప్రాంతాల్లో పనులు నిరంతరాయంగా కొనసాగించాలని స్పష్టం చేశారు. గిరిజన గ్రామాలకు విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలను చేరువ చేయాలన్న బలమైన సంకల్పంతో గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహకారంతో చేపట్టిన అడవితల్లి బాట పనుల్లో నాణ్యతా లోపాలకు తావు లేకుండా నిరంతర పర్యవేక్షణ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని తెలిపారు. డోలీ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఆదివాసి దినోత్సవం రోజున గిరిజన యువకుని జీవితంలో కొత్త వెలుగులు_

-కక్ష సాధింపుతో కాలిపోయిన ఆటో… మానవత్వంతో వెలిగిన కొత్త జీవితం -జీవనాధారాన్ని కోల్పోయిన కుటుంబానికి మళ్లీ ఉపాధి బాట చూపిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *