-పోషన్ పఖ్వాడా ద్వారా పౌష్టికాహారంపై అవగాహన కార్యక్రమాలు…
-అంగన్వాడీలలో చిరుధాన్యలు, ఆకుకూరల వినియోగంపై అవగాహన…
-జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గర్భిణిలు, బాలింతులు, శిశువులలో రక్తహీనత, పౌష్టికాహార లోపాలను నివారించి ఆరోగ్య వంతులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని పోషన్ పఖ్వాడా ద్వారా చిరుధాన్యాలు, ఆకుకూరలతో పౌష్టికాహారం వంటకాలపై అవగాహన కల్పిస్తునట్లు జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు తెలిపారు.
పోషన్ పఖ్వాడా కార్యక్రమంలో భాగంగా శనివారం సింగ్నగర్ షాదీఖానాలో మహిళ శిశు సంక్షేమ శాఖ నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ శాసనసభ్యులు మల్లాది విష్ణువర్థన్ ముఖ్య అతిధులుగా హాజరై మహిళలకు సామూహిక సీమంతాలను నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గర్భిణిలు, బాలింతులు, శిశువులలో ఆరోగ్యంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి పెట్టాయన్నారు. జిల్లాలో 10,313 మంది గర్భిణీ స్త్రీలు, 10,073 మంది బాలింతలకు, ఏడు నెలల నుండి మూడు సంవత్సరాల వయస్సు కలిగిన 49,330 మంది చిన్నారులకు, మూడు సంవత్సరాల నుండి ఏడు సంవత్సరాల వయస్సుగల 21,777 చిన్నారులకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారాన్ని అందించడం జరుగుతుందన్నారు. మహిళలు గర్భం దాల్చిన నాల్గవ మాసం నుండి శిశువులో మెదడు ఎదుగుదల ప్రారంభం అవుతుందన్నారు. ఆ సమయంలో గర్భిణి స్త్రీ కార్బోహైడ్రేట్స్, విటమిన్స్, మినరల్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నారు. మెదడు ఎదుగుదలకు అవసరమైన గ్లూకోజ్ తో పాటు పౌష్టికాహారం తీసుకున్నట్లయితే పుట్టబోయే బిడ్డకు ఆరోగ్య వంతమైన జన్మనిచ్చే అవకాశం ఉంటుందన్నారు. ఆరోగ్యానికి హానికరమైన జంక్ఫుడ్స్కి దూరంగా ఉండి ఆకుకూరలు చిరుధాన్యాలు ఆహారంగా తీసుకోవాలని కోరారు. కౌమార బాలికలలో రక్తహీనతను నివారించేందుకు సంక్షేమ వసతి గృహాలలో తాటి బెల్లం కార్యక్రమాన్ని ప్రారంభించామని, అంగన్వాడీ కేంద్రాలలో వైఎస్సార్ సంపూర్ణ పోషన్ కిట్లతో పాటు తాటి బెల్లం పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. గర్భిణీ స్త్రీలు, బాలితలలో నీరసం, ఆలసట, ఆయాసం, జుట్టు రంగు మారడం, కళ్లు తెల్లగా ఉండటం, కాళ్ల వాపు, తిమ్మిర్లు వంటి లక్షణాలను గుర్తిస్తే తక్షణమే వైద్య చికిత్సలు చేయించుకోవాలన్నారు. రాగులు, కొర్రలు, జొన్నలు, సజ్జలు, తదితర చిరుధాన్యాలతో పాటు ఆకుకూరలను ఉపయోగించి పౌష్టికాహారం తయారి పై లఘ చిత్రాన్ని చిత్రీకరించి మహిళల వాట్సాప్లో పొందుపరిచేలా మహిళ శిశు సంక్షేమ అధికారులు చర్యలు తీసుకోవాలని మహిళ శిశు సంక్షేమ అధికారులకు జిల్లా కలెక్టర్ డిల్లీరావు సూచించారు.
ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ శాసనసభ్యులు మల్లాది విష్ణువర్థన్ మాట్లాడుతూ గర్భిణిలు, బాలింతులు, శిశువుల ఆరోగ్యంపై రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్ఆర్ సంపూర్ణ పోషన్ కిట్ల ద్వారా 1కేజి రాగి పిండి, 1 కేజి అటుకులు, 1 కేజి జొన్నపిండి, 250 గ్రాముల బెల్లం, 250 గ్రాముల వేరుశనగ చిక్కి, 250 ఎండు ఖర్జూరాన్ని పంపిణీ చేసేలా చర్యలు తీసుకున్నారన్నారు. గర్భిణీ స్త్రీలు, బాలింతల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని అంగన్వాడీ కేంద్రాల ద్వారా పంపిణీ చేసే సంపూర్ణ పోషన్ కిట్లను ఇళ్ల వద్దకే సరఫరా చేసి వినియోగించేలా పర్యవేక్షించాలని సూచించారు. పుట్టిన బిడ్డకు తల్లిపాలకు మించిన పోష్టికాహారం లేదని తప్పనిసరిగా తల్లిపాలను బిడ్డకు అందిస్తే వ్యాధి నిరోదక శక్తి పెరగడానికి దోహదపడుతుందన్నారు. ప్రపంచ దేశాలు చిరుధాన్యాల వినియోగం వైపు చూస్తున్నాయన్నారు. మన ఆహారపు అలవాట్లలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఆరోగ్యానికి మేలు చేసే చిరుధాన్యాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. చిరుధాన్యాల ఉత్పత్తిని పెంచేందుకు ప్రభుత్వం రైతులను ప్రోత్సహిస్తుందన్నారు. మహిళ శిశువుల ఆరోగ్యం పరిరక్షణకు ప్రభుత్వం అమలు చేసే కార్యక్రమాల విసృత్తంగా ప్రచారం కల్పించి ప్రజలు సద్వినియోగం చేసుకునేలా కృషి చేయాలని మల్లాదివిష్ణువర్థన్ కోరారు.
కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్, డిప్యూటి మేయర్ అవుతు శైలజారెడ్డి, 59వ డివిజన్ కార్పొరేటర్ యండి. షహినా సుల్తానా, మహిళ శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ జి. ఉమాదేవి, సిడిపివోలు టి.నాగమణి, జి. మంగమ్మ, డి. జోత్స్న, అంగన్వాడీ సూపర్వైజర్లు, కార్యకర్తలు, గర్భిణీలు బాలింతలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News