తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీ సిటీ ద్వారా రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి కొత్తపుంతలు తొక్కుతుందని సి.ఆర్. మీడియా అకాడమీ ఛైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు కొనియాడారు. ఇంతటి బృహత్తర పారిశ్రామిక వాడను తీర్చదిద్ది, సమర్ధవంతంగా నిర్వహిస్తున్న ఎం.డి. సన్నారెడ్డి రవీంద్ర సేవలను ఛైర్మన్ ప్రశంసించారు. వేలాదిమందికి ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పించిన రవీంద్ర దేశ సేవలో తరిస్తున్నట్లు తాము భావిస్తున్నామన్నారు. ముఖ్య మంత్రి వై. ఎస్. జగన్ మోహన రెడ్డి పారిశ్రామిక అభివృద్ధి లక్ష్యానికి అనుగుణంగా పలు పరిశ్రమలు రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్న సంగతిని ఆయన గుర్తు చేశారు. శ్రీ సిటీ కి సుమారు 2 లక్షల 50 వేల కోట్ల పెట్టుబడులు తరలి వచ్చాయన్నారు. 28 దేశాలకు చెందిన పరిశ్రమలు శ్రీ సిటీ లో యేర్పాటవ్వడం హర్షణీయమన్నారు. దేశంలో పెట్టుబడులకు అనువైనవిగా విదేశీ పారిశ్రామిక వేత్తలు భావించే 10 ముఖ్య ప్రాంతాల్లో శ్రీ సిటీ ఒకటి గా నిలవడం గర్వకారణమన్నారు. మొత్తం 210 పరిశ్రమలకు గాను, నిర్వహించ బడుతున్న 165 పరిశ్రమల్లో ప్రత్యక్షంగా 65 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కలిగాయన్నారు. పరోక్షంగా మరొక 2.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించాయన్నారు. చుట్టుపక్కల గ్రామాల యువతకు తమ పరిశ్రమల అవసరాలకు తగిన శిక్షణ ఇచ్చి మరీ ఉద్యోగ అవకాశాలు కలిపించడం జరిగిందన్నారు. ఎనిమిది వేల ఎకరాల్లో విస్తరించిన శ్రీ సిటీ లో పర్యావరణం, పారిశుధ్యం ప్రమాణాలు అంతర్జాతీయ స్థాయి లో నిర్వహించడం ఆదర్శప్రాయమని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. మేనేజ్ంగ్ డైరక్టర్ సన్నారెడ్డి రవీంద్ర బాబు ను ఛైర్మన్ దుశ్శాలువాతో సన్మానించారు.
ఈ సందర్భంగా 2008 లో అప్పటి సి.యం. వై. ఎస్. రాజశేఖర రెడ్డి శ్రీ సిటీ యేర్పాటు ప్రతిపాదించి, స్వయంగా ప్రారంభించిన సంగతిని ఛైర్మన్ గుర్తు చేశారు.రాష్ట్ర వ్యాప్తంగా వై. ఎస్. రాజశేఖర రెడ్డి తలపెట్టిన పారిశ్రామిక వాడలు అమలయ్యి పారిశ్రామిక అభివృద్ధి జరిగి వుంటే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగి వుండేవని ఆయన అన్నారు. రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ బలోపేతం అయ్యేదని ఆయన అన్నారు. శ్రీసిటీ ని సందర్శించిన కొమ్మినేనికి ఎం. డి సన్నారెడ్డి రవీంద్ర సాదర స్వాగతం పలికారు. శాలువాతో సత్కరించి జ్ఞాపిక అందజేశారు. ఈ కార్యక్రమంలో ఒ.ఎస్.డి. ఎస్. శ్రీనివాస జీవన్, శ్రీ సిటీ జి.ఎం రవి కృష్ణ తదితర్లు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News