-పాఠశాల విద్యాశాఖ కమీషనర్ ఎస్.సురేష్ కుమార్
-రాష్ట్ర వ్యాప్తంగా 98.89 శాతం హాజరు
-అత్యధికంగా కర్నూలు నుంచి హాజరు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో నిర్వహిస్తున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష మూడోరోజు విజయవంతంగా ముగిసిందని పాఠశాల విద్యాశాఖ కమీషనర్ ఎస్.సురేష్ కుమార్ అన్నారు. గురువారం పేపర్1 ఏ పరీక్షలకు 33055 మంది అభ్యర్థులకు గాను 28917 మంది (87.48 శాతం) హాజరయ్యారన్నారు. గురువారం జరిగిన పరీక్షల్లో కర్నూలు జిల్లా నుంచి అత్యధికంగా 98.89% హాజరయ్యారని తెలిపారు. రాష్ట్రంలో కొన్ని పరీక్షా కేంద్రాల్లో హాజరైన వారిలో 17మంది అభ్యర్థులు తమ దరఖాస్తులు నింపే సమయంలో జాగ్రత్త వహించకపోవడం వల్ల, తప్పుడు సమాచారం ఇవ్వడం వల్ల, , ముందుగా డౌన్లోడ్ చేసుకుని పరిశీలించుకోకపోవడం వల్ల అభ్యర్థి పేరు, పరీక్షా కేంద్రాల ఎంపిక తదితర విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయని పేర్కొన్నారు. ఆ అభ్యర్థుల సమస్యలకు పరీక్షా యంత్రాంగం తక్షణం స్పందించి ‘బఫర్ హాల్ టికెట్లను’ అందించి అభ్యర్థులు ఎవరికి నష్టం జరగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి పరీక్షలు విజయవంతంగా జరిగేలా చూశారని యంత్రాంగానికి అభినందించారు. ముందుగానే హాల్ టికెట్లు పరిశీలించుకోవాలి. అభ్యర్థులు తమ హాల్ టికెట్లను చివరి క్షణంలో కాకుండా పరీక్ష తేదీకి వీలైనంత ముందుగా డౌన్లోడ్ చేసుకుని, వివరాలను పూర్తిగా పరిశీలించుకోవాలన్నారు. ఏవైనా తప్పులు ఉన్నట్లయితే వెంటనే జిల్లా విద్యాశాఖ అధికారిని సంప్రదించి వారి ద్వారా సవరణల వివరాలను ఏపీటిఆర్సీకి మెయిల్ చేయించాలని తెలిపారు. తద్వారా ఇబ్బందులు లేకుండా పరీక్షలు రాసుకోవచ్చని పాఠశాల విద్య కమీషనర్ ఎస్.సురేష్ కుమార్ అభ్యర్థులకు సూచించారు.
Prajavartha Online Telugu News