గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో పదవ తరగతి పరీక్షలు విద్యార్ధులకు ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతవరణంలో, సజావుగా జరిగేలా అధికారులు సమన్వయంతో పటిష్ట ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ ఆదేశించారు.
సోమవారం కలెక్టరేట్ లోని వీడీయో కాన్ఫరెన్స్ హాలులో జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ పదవ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణపై జిల్లా అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షలు మార్చి 17వ తేది నుంచి రంజాన్ పండుగ దృష్ట్యా 2025 మార్చి 31 లేదా ఏప్రిల్ 1 వరకు కొనసాగుతాయన్నారు. జిల్లాలో 470 పాఠశాలలకు సంబంధించి రెగ్యూలర్ విద్యార్ధులు 29,499 మంది, ప్రైవేటు గా 961 మంది విద్యార్ధులు మొత్తం 30,460 మంది విద్యార్ధులు 150 పరీక్ష కేంద్రాలలో పదవ తరగతి పరీక్షలకు హాజరవుతున్నారన్నారు. పరీక్షలు ఉదయం 9.30 గం. ల నుంచి మధ్యహ్నం 12.45 వరకు జరుగుతాయన్నారు. పరీక్షలకు సంబంధించిన కాన్ఫిడెన్షియల్ మెటీరియల్ స్టోరీజ్ సెంటర్, డిస్టిబ్యూషన్ సమయంలో సాయుధ పోలీస్ లతో పటిష్ట బందోబస్తు ఏర్పాటుకు పోలీస్ శాఖ చర్యలు తీసుకోవాలన్నారు. మెటీరియల్ తరలింపుకు అవసరమైన వాహనాలను విద్యా శాఖకు అందించాలని రవాణా శాఖ అధికారులకు సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద 114 సెక్షన్ అమలు చేసి, సమీప ప్రాంతాల్లోని జిరాక్స్ సెంటర్లు మూసివేయించాలని, పోలీస్ శాఖతో అవసరమైన బందోబస్తు ఏర్పాటు కు రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. విద్యా శాఖ, రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారులతో ఫ్లైయింగ్ స్క్వాడ్ లు ఏర్పాటు చేయాలన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద పారిశుద్ధ్యం పనులు, మంచినీటి ఏర్పాటుకు మున్సిపల్, పంచాయితీ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్ష కేంద్రాలు వద్ద వైద్యశిబిరాలు ఏర్పటు చేసి వేసవి దృష్ట్యా డీహైడ్రేషన్ కు సంబంధించిన మందులు అందుబాటులో ఉండేలా వైద్యశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్ష కేంద్రాల విద్యార్ధుల అవసరం మేరకు బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. పరీక్షల సమయంలో విధ్యుత్ అంతరాయం లేకుండా విద్యుత్ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జవాబు పత్రాలను ఆలస్యం లేకుండా వెంటనే పోస్ట్ చేసేలా పోస్టల్ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో సమస్యాత్మకంగా గుర్తించిన పరీక్ష కేంద్రాలు వద్ద ప్రత్యేక దృష్టి పెట్టి చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్షలలో మాల్ ప్రాక్టీస్ , కాపీయింగ్ జరగకుండా విద్యా శాఖ, రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారులు సమన్వయంతో పర్యవేక్షించాలన్నారు. విద్యార్ధులు ఒత్తిడి లేకుండా పరీక్షలు వ్రాసేలా పరీక్ష కేంద్రాల్లో అవసరమైన మౌలిక సౌకర్యాలు పూర్తి స్థాయిలో కల్పించేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు.
సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ ఎస్ కే ఖాజావలి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గంగరాజు, డ్వామా పీడీ శంకర్, జిల్లా విద్యా శాఖ అధికారిణి రేణుక, డీఎంహెచ్ఓ డా. విజయలక్ష్మీ, ఎస్బీ సీఐ శ్రీనివాసరావు, ఎంవీఐ గోపాల్, నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్, సీపీడీసీఎల్ డీఈ ప్రసాద్, జిల్లా విద్యా శాఖ అసిస్టెంట్ కమిషనర్ వెంకటరెడ్డి, గుంటూరు పోస్టల్ శాఖ ఇన్ స్పెక్టర్ రవిశేఖర్, తెనాలి అసిస్టెంట్ సూపరింటెండెంట్ పాంచజన్య రెడ్డి, ఆర్టీసీ డిపో మేనేజరు డి ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News