తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
సీబీసీ విజయవాడ, పద్మావతి విశ్వవిద్యాలయంతో కలిసి తిరుపతిలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమం భాషా వైవిధ్యాన్ని గుర్తించడంతో పాటు భారతీయ జ్ఞాన పరంపరను ప్రోత్సహించడానికి మద్దతుగా నిలిచింది. ఈ సందర్భంగా, పీఐబి, సిబిసిల ఆంధ్రప్రదేశ్ రీజియన్ అదనపు డైరెక్టర్ జనరల్ రాజిందర్ చౌధరి మాట్లాడుతూ, భారతదేశ భాషా వైవిధ్యం “భిన్నత్వం లో ఏకత్వం”కు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. విద్యార్థులు తమ సృజనాత్మకతను చాటుకునేందుకు వేవ్స్ 2025 సమ్మిట్లో భాగంగా జరుగుతున్న క్రియేటివ్ ఛాలెంజెస్లో పాల్గొనాలని ఆయన సూచించారు.
సామాజిక శాస్త్ర విభాగ డీన్ ప్రొఫెసర్ సి. వాణి మాట్లాడుతూ, విద్యార్థులు తమ మాతృభాషను పరిరక్షించేందుకు, సంస్కృతిని కాపాడేందుకు కథానికలు, రచనలు సృష్టించాలని ప్రోత్సహించారు. కార్యక్రమంలో భాషా పీఠం, తెలుగు విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాసరచన, ఉపన్యాస పోటీలు, కృత్రిమ మేధస్సు పై ప్రత్యక్ష కవితల పోటీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వివిధ విభాగాల నుండి 150 మందికి పైగా విద్యార్థులు పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
సాంగ్ & డ్రామా డివిజన్కు చెందిన కళాకారులు, తెలుగు భాషా సంపదను ప్రతిబింబించే గీతాలను ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. “ఏక పేడ్ మా కే నామ్” కార్యక్రమంలో భాగంగా గౌరవనీయ అతిథులు మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యతను చాటిచెప్పారు.
కార్యక్రమం చివర్లో పోటీ విజేతలకు బహుమతులు ప్రదానం చేయడంతో పాటు, ప్రముఖ అతిథులను శాలువాలు, జ్ఞాపికలు మరియు పుష్పగుచ్ఛాలతో సన్మానించారు. ఈ వేడుక భాషా వైవిధ్యాన్ని, సంస్కృతి పరిరక్షణను బలంగా ప్రోత్సహిస్తూ విజయవంతంగా ముగిసింది.
Prajavartha Online Telugu News