-తరావీహ్ నమాజ్ తో గత పాపాల మన్నింపు
-మసీదుల్లో నెల రోజుల పాటు తరావీహ్ నమాజ్ లు ఆచరించనున్న ముస్లింలు
మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త :
పవిత్ర రంజాన్ మాసం శనివారం సాయంత్రం నెలవంక దర్శనంతో ప్రారంభం కావడంతో అదే రోజు రాత్రి ముస్లిం లు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్ధన (తరావీహ్ నమాజ్) లు ప్రారంభించారు. ‘తరావీహ్’ అనే పదానికి ‘విశ్రాంతి తీసుకోవడం అని అర్థం. రంజాన్ సమయంలో ఆరాధనలో ముఖ్యమైన భాగం తరావీహ్ నమాజ్. చివరి రోజువారీ ప్రార్థన అయిన ఇషా నమాజ్ అనంతరం ముస్లింలు చేసే ప్రత్యేక ప్రార్థనే తరావీహ్ నమాజ్. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలోనే తరావీహ్ నమాజ్ ప్రారంభమైంది. మొహమ్మద్ ప్రవక్త (స.అ.సం) ఇలా అన్నారు. ఎవరైతే రంజాన్ అంతటా విశ్వాసం యొక్క నిజాయితీతో, ప్రతిఫలం పొందాలనే ఆశతో తరావీహ్ నమాజ్ పాటిస్తారో వారి గత పాపాలు క్షమించ బడతాయి. ఖురాన్ -హదీస్ ల ప్రకారం తరావీహ్ నమాజ్ లో 11 రకాతుల నమాజ్ చేస్తారు. మసీదుల్లో నెల రోజుల పాటు నిర్వహించే తరావీహ్ నమాజ్ లో మత గురువులు మొత్తం దివ్య ఖురాన్ పారాయణం పూర్తి చేస్తారు. రంజాన్ మాసంలో తరావీహ్ నమాజ్ చేసే వారికి గొప్ప ప్రతిఫలం లభించడంతో పాటు గత పాపాలు మన్నించబడతాయని ముస్లింల నమ్మకం.
తరావీహ్ నమాజ్ చేయడం సున్నత్. మహిళలు, పిల్లలు కూడా మసీదుకు హాజరుకావాలి. ఎందుకంటే ఇది ముస్లింల మధ్య ఐక్యతను చాటడంతో పాటు వారి సంబంధాలను మరింత బలపర్చుతుంది.
Prajavartha Online Telugu News