గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలో పారిశుధ్య పనుల పర్యవేక్షణ విధుల్లో నిర్లక్ష్యవైఖరి కారణంగా, ప్రజారోగ్య విభాగ ప్రాధాన్యత మేరకు మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ (ఎంహెచ్ఓ) డాక్టర్ ఎం.రవిబాబుని తమ మాతృశాఖకు సరెండర్ చేస్తున్నామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ప్రజారోగ్య పరిరక్షణలో ప్రజారోగ్య విభాగం కీలకమని, అటువంటి విభాగం సమర్దవంతంగా పనిచేసేలా పర్యవేక్షణ చేయాలని, అందుకు అవసరమైన సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపినప్పటికీ ఎంహెచ్ఓ రవిబాబు పనితీరు మెరుగు పరుచుకోలేదన్నారు. క్షేత్ర స్థాయి పర్యటనల్లో పలుమార్లు ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు సూచించినా పర్యవేక్షణ లోపం కొనసాగుతున్నందున, తమ మాతృశాఖకు తక్షణం సరెండర్ చేస్తున్నామని తెలిపారు. అలాగే పరిపాలన అవసరాల రీత్యా గుంటూరు తూర్పు నియోజకవర్గానికి రామారావు, పశ్చిమ నియోజకవర్గానికి సోమశేఖర్ లను ఇంచార్జి ఎంహెచ్ఓలు గా విధులు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశామన్నారు.
Prajavartha Online Telugu News