అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
గ్రామ వార్డు సచివాలయాలలో నియమించబడిన మహిళా పోలీస్ ను పోలీస్ శాఖలో ఇంటిగ్రేషన్ చేసే అంశంపై గురువారం అమరావతి సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యా నాధ్ దాస్ అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది. ఈసమావేశంలో డిజిపి గౌతం సవాంగ్ మాట్లాడుతూ గ్రామ,వార్డు సచివాలయాల్లో నియమించిన మహిళా పోలీస్ ను ఏవిధంగా పోలీస్ శాఖలో ఇంటిగ్రేట్ చేయాలి అందుకు తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై వివరించారు.ముఖ్యంగా ఇందుకు సంబంధించిన సర్వీస్ నిబంధనలకు రూపకల్పనకు గాను స్పెషల్ రూల్స్ ఫర్ ఎపి మహిళా పోలీస్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ మార్పు తదితర అంశాలను వివరించారు.అలాగే ఎపి విలేజ్,వార్డు మహిళా పోలీస్ చట్టం 1974 గురించి తెలిపారు.ఇంకా వారికి శిక్షణ,పదోన్నతి,యూనిఫాం, విభిన్న ప్రతిభావంతుల కేటగిరీలో మహిళా పోలీస్ గా నియమింపబడిన వారిని ఇతర శాఖలకు బదలాయింపు అంశాలను సమావేశంలో చర్చించారు.
ఈసమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యా నాధ్ దాస్ మాట్లాడుతూ పోలీస్ శాఖలో మహిళా పోలీస్ ఇంటిగ్రేషన్ కు సంబంధించిన విధి విధానాలు త్వరిత గతిన రూపొందించాలని చెప్పారు.అలాగే వారికి శిక్షణ,యూనిఫాం తదితర అవసరాలకు తగిన బడ్జెట్ పై అవసరమైన చర్యలు తీసుకోవాలని గ్రామ వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్,సర్వీసులు శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ లను సిఎస్ ఆదిత్యా నాధ్ దాస్ ఆదేశించారు. ఈసమావేశంలో అదనపు డిజి శాంతి భద్రతలు రవిశంకర్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, హోం, స్త్రీ శిశు సంక్షేమం,సర్వీసులు శాఖల ముఖ్య కార్యదర్శులు కుమార్ విశ్వజిత్,ఎఆర్ అనురాధ,శశిభూషణ్ కుమార్,ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News