-ఎమ్మెల్యే సుజనా చొరవతో పశ్చిమ లో ప్రణాళికలు రూపొందిస్తున్న అధికారులు..
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో , పశ్చిమ నియోజకవర్గంలోని కొండ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు పైప్లైన్ ద్వారా వంట గ్యాస్ అందించేందుకు గెయిల్, మరియు భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ సంయుక్త ఆధ్వర్యంలో సంబంధిత అధికారులు దృష్టి సారించారు. ఎమ్మెల్యే ఆదేశాలతో కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, భాగ్యనగర్ గ్యాస్ అధికారులు , సామాజికవేత్త ఆకుల శ్రీనివాసరావు, మున్సిపల్ కార్పొరేషన్ రిటైర్డ్ ఎస్ఈ ఉదయ్ కుమార్ లతో కలిసి శుక్రవారం మల్లికార్జున పేట, ఉప్పర వాగు కొండ ప్రాంతాల్లో పర్యటించి సాధ్యసాధ్యలను పరిశీలించారు. సిలిండర్లు మోసే కష్టాలను తప్పించడానికి, కొండ ప్రాంతాల్లో రోడ్డు సౌకర్యం తక్కువగా ఉన్న చోట్ల, ప్రతి ఇంటికి పైప్లైన్ ద్వారా గ్యాస్ కనెక్షన్ ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. దీనివల్ల గ్యాస్ సిలిండర్లను మోసుకెళ్లే ఇబ్బందులు తప్పుతాయి. కొండ ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడటమే కాకుండా, పర్యావరణానికి కూడా మేలు జరుగుతుంది. ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రత్యేక చొరవతో చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమం కొండప్రాంత ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని, వారి వంట గ్యాస్ కష్టాలకు త్వరలోనే స్వస్తి పలకబోతున్నామని అధికారులు ధీమా వ్యక్తం చేశారు.
Prajavartha Online Telugu News