అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఐసిఏఐ దక్షిణ భారత ప్రాంతీయ మండలి ఎస్ ఐఆర్ సి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 58వ ప్రాంతీయ సదస్సు దక్ష శుక్రవారం మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్లో ఘనంగా ప్రారంభమైంది. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు దక్షిణ భారత రాష్ట్రాల నుంచి వేలాది మంది చార్టర్డ్ అకౌంటెంట్లు విద్యార్థులు పరిశ్రమల ప్రతినిధులు హాజరయ్యారు.
రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ముఖ్యఅతిథిగా పాల్గొని సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధిలో చార్టర్డ్ అకౌంటెంట్ల పాత్ర కీలకమని అన్నారు. పారదర్శక ఆర్థిక వ్యవస్థ సమర్థవంతమైన పన్నుల నిర్వహణ పెట్టుబడుల ఆకర్షణ సుస్థిర అభివృద్ధికి సీఏల సేవలు ఎంతో అవసరమని పేర్కొన్నారు. డిజిటల్ యుగానికి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని యువ సీఏలు దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఐసిఏఐ అధ్యక్షుడు సి.ఏ. ప్రసన్న కుమార్ మాట్లాడుతూ వేగంగా మారుతున్న ప్రపంచ ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా చార్టర్డ్ అకౌంటెంట్లు తమ నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కృత్రిమ మేధస్సు (ఏఐ) డేటా అనలిటిక్స్ డిజిటల్ ఆడిటింగ్ వంటి ఆధునిక సాంకేతికతలను సమర్థంగా వినియోగించుకోవాలని సూచించారు. నైతిక విలువలు పారదర్శకత ప్రజా విశ్వాసాన్ని కాపాడటం సీఏల ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు.
ఐసిఏఐ ఉపాధ్యక్షుడు సి.ఏ. మంగేష్ కినారే మాట్లాడుతూ నిరంతర అధ్యయనం నైపుణ్యాభివృద్ధి ఆవిష్కరణలే వృత్తిలో విజయానికి మూలాధారమని చెప్పారు. ప్రపంచ స్థాయి అవకాశాలను అందిపుచ్చుకుని భారతీయ చార్టర్డ్ అకౌంటెన్సీ ప్రతిష్ఠను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని యువ సభ్యులకు పిలుపునిచ్చారు.
ఎస్ ఐఆర్ సి ఛైర్మన్ సి.ఏ. ముప్పాల సుబ్బారావు మాట్లాడుతూ ఈ సదస్సు వృత్తిపరమైన నైపుణ్యాల పెంపు జ్ఞాన వినిమయం నెట్వర్కింగ్కు ఉత్తమ వేదికగా నిలుస్తుందని తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రముఖ నిపుణులు పాల్గొని ఆడిటింగ్ పన్నుల విధానం ఆర్థిక నివేదికలు కార్పొరేట్ గవర్నెన్స్ ఈఎస్ జి కృత్రిమ మేధస్సు నాయకత్వం తదితర అంశాలపై సాంకేతిక ప్రసంగాలు చర్చలు నిర్వహించనున్నట్లు చెప్పారు.
ఈ సదస్సు ద్వారా సభ్యులు విద్యార్థులు తాజా పరిణామాలపై అవగాహన పెంపొందించుకుని తమ వృత్తిపరమైన నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకునే అవకాశం లభించనుంది.
Prajavartha Online Telugu News