-వృత్తిపట్ల నిబద్ధత ఉండాలి
-క్రమశిక్షణతో పనిచేయాలి
-నూతన ఆయుష్ వైద్యులకు డైరెక్టర్ రోణంకి గోపాల్ కృష్ణ హితవు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నూతనంగా విధుల్లో చేరిన ఆయుష్ వైద్యులు ప్రజాసేవనే పరమావధిగా భావించి, వృత్తిపట్ల పూర్తి నిబద్ధత, క్రమశిక్షణతో పనిచేస్తూ ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలని ఆయుష్ డైరెక్టర్ రోణంకి గోపాల్ కృష్ణ సూచించారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టేలా సేవలందించడంతో పాటు ప్రభుత్వ ప్రజారోగ్య కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో సమర్థంగా అమలు చేయాలని పిలుపునిచ్చారు. నేషనల్ ఆయుష్ మిషన్ (ఎన్ఏఎం – NAM) ఆధ్వర్యంలో నూతనంగా ఎంపికైన హోమియో, యునానీ వైద్యులకు విజయవాడ ఆటోనగర్లోని ఆయుష్ కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమం రెండో రోజు ఆయన మాట్లాడారు. నూతన వైద్యులకు విధులు, బాధ్యతలు, జాబ్ చార్ట్పై సమగ్ర అవగాహన కల్పించారు. ఆయుష్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లు (ఏహెచ్డబ్ల్యూసీ – AHWC) నిర్వహణ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించడం, ప్రజారోగ్య కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో సమర్థంగా అమలు చేయడం ప్రతి వైద్యుడి బాధ్యత అని చెప్పారు. జాబ్ చార్ట్లో నిర్దేశించిన విధులను తప్పనిసరిగా పాటిస్తూ, సేవల నాణ్యతను మరింత మెరుగుపర్చాలని సూచించారు.
ప్రజారోగ్య కార్యక్రమాలపై శిక్షణ
శిక్షణలో భాగంగా నేషనల్ ఆయుష్ మిషన్ అమలు మార్గదర్శకాలు, అసాంక్రమిక వ్యాధుల (ఎన్సీడీ – NCD) స్క్రీనింగ్, ఆయుష్ హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (ఏహెచ్ఎంఐఎస్ – AHMIS) ద్వారా నివేదికల నమోదు, ప్రజారోగ్య కార్యక్రమాల అమలు తదితర అంశాలపై అధికారులు, నిపుణులు నూతన వైద్యులకు శిక్షణ ఇచ్చారు. అనంతరం మెడికల్ క్యాంప్ కిట్లను పంపిణీ చేశారు. మూడో రోజు శనివారం బడ్జెట్ కేటాయింపులు, ఆర్థిక నిర్వహణ, నేషనల్ ఆయుష్ మిషన్ పోర్టల్ నిర్వహణ, జిల్లా ఆయుష్ సొసైటీల సమన్వయంపై ప్రత్యేక సదస్సు నిర్వహించి శిక్షణ కార్యక్రమాన్ని ముగించనున్నారు.
Prajavartha Online Telugu News