కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఆపదలో ఉన్న పేదలకు నేనున్నానంటూ ముఖ్యమంత్రి సహాయ నిధి అభయహస్తం అందిస్తూ వారికి కొండంత అండ గా నిలుస్తున్నదని రాష్ట్ర హోంమంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత తెలిపారు. పోలవరం నియోజకవర్గ పరిధిలోని పోలవరం మండలం గూటాల గ్రామానికి చెందిన కట్టూరి కొండయ్య భార్య దుర్గ గుండె సంబంధిత వ్యాధితో నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న నేపథ్యంలో సీఎంఆర్ఎఫ్ నుండి మంజూరైన 7 లక్షల రూపాయల లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్ఓసి) పత్రాన్ని శుక్రవారం రాత్రి ఆమె పంపిణీ చేశారు. చాగల్లు మండలం చాగల్లులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఈ పత్రాన్ని కట్టూరి కొండయ్యకు అందజేశారు. ఈ సందర్భంగా హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ… గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న దుర్గకు గుండెలో ‘CRT-D’ మిషన్ అమర్చడానికి దాదాపు 7 లక్షలు ఖర్చు అవుతుందని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగానే వెంటనే ఆ మొత్తాన్ని మంజూరు చేసి బాధిత కుటుంబానికి అండగా నిలిచారన్నారు. జగనన్న ప్రభుత్వం పేదల పక్షపాత ప్రభుత్వమని మరోసారి రుజువు చేశారు. బాధితురాలు దుర్గ చికిత్స అనంతరం త్వరగా కోలుకోవాలని హోంమంత్రి ఆకాక్షించారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, హోంమంత్రి తానేటి వనితల అందించిన సాయం ఎప్పటికీ మరిచిపోలేనని కొండయ్య ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరు నియోజకవర్గ స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News