-లాటరీ ద్వారా 11702 మంది ఎంపిక… ఆగస్టు 31 లోపు విద్యార్థులను చేర్పించాలి
-సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు IAS.,
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బాలల ఉచిత నిర్బంధ విద్యాహక్కు (ఆర్టీఈ) చట్టం 12(1) సి ప్రకారం 2025-26 విద్యా సంవత్సరానికి ప్రైవేటు పాఠశాలల్లో పేద విద్యార్థులకు కేటాయించిన 25 శాతం ఒకటో తరగతి ఉచిత ప్రవేశాలకు సంబంధించి అదనపు నోటిఫికేషన్ లాటరీ ఫలితాలు 25.08.2025న విడుదల చేసినట్లు సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు IAS., ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం ఐదు కిలోమీటర్ల పరిధిలోని ప్రైవేటు పాఠశాలల్లో సీట్లు ఖాళీ ఉన్న నేపథ్యంలో ఆగస్టు 12 నుండి 20వ తేదీ వరకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవడానికి ప్రభుత్వం మరొక అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారు మరియు గతంలో దరఖాస్తు చేసుకొని అడ్మిషన్ కేటాయింపు జరగనివారికి కలిపి వారు ఇచ్చిన ఐచ్ఛికాల ఆధారంగా 11702 మంది లాటరీ ద్వారా ఎంపిక చేసినట్లు తెలిపారు. ఎంపికైన విద్యార్థులను ఆగస్టు 31లోపు సంబంధిత సిబ్లింగ్ సర్టిఫికేట్ (తోబుట్టువులు మాత్రమే), కుల, ఆదాయ, పుట్టిన తేదీ, ఆధార్, దివ్యాంగ (ఉన్నట్లయితే) వంటి ధృవపత్రాలను సమర్పించి పాఠశాలల్లో చేర్పించాలన్నారు. ఆగస్టు 31 నాటికి పాఠశాలల్లో అడ్మిషన్ పొందకపోయినట్లయితే ఆ అడ్మిషన్లు రద్దు చేయనున్నామని తెలిపారు. ఎంపికైన విద్యార్థుల సమాచారం తల్లిదండ్రుల మొబైల్ నంబర్లకు ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేయడంతో పాటు, https://cse.ap.gov.in/ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంటాయన్నారు.
Prajavartha Online Telugu News