-28న ధర్మవరంలో మెగా జాబ్ మేళా
-పోస్టర్ని ఆవిష్కరించిన మంత్రి సత్య కుమార్ యాదవ్
-ఉద్యోగాల కోసం తిరగాల్సిన అవసరం లేదు… కంపెనీలనే ధర్మవరానికి తీసుకొస్తున్నాం – మంత్రి సత్యకుమార్ యాదవ్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే యోజనతో నిర్వహిస్తున్న జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్య శాఖామాత్యులు, ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సంస్కృతి సేవా సంస్థ సౌజన్యంతో ఈనెల 28 వ తేదీన ధర్మవరంలోని CNB కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్న జాబ్ మేళాకు సంబంధించిన పోస్టర్లను అమరావతిలో సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… నేటి పరిస్థితుల్లో అనేక మంది యువతీ, యువకులు తమ చదువులు పూర్తి చేసిన తర్వాత ఉద్యోగాల కోసం నగరాలు తిరుగుతూ, అనేక కంపెనీలను ఆశ్రయిస్తూ ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. అలాంటి ఇబ్బందులు లేకుండా దేశంలోని ప్రముఖ సంస్థలను, బహుళజాతి కంపెనీలను నేరుగా ధర్మవరానికి తీసుకువచ్చి ఒకే వేదికపై ఉద్యోగ అవకాశాలు కల్పించడం ఈ మెగా జాబ్ మేళా ప్రధాన ఉద్దేశమని చెప్పారు. ధర్మవరం నియోజకవర్గ యువతకు ఇదొక అరుదైన అవకాశమని, ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదని మంత్రి పిలుపునిచ్చారు. ప్రభుత్వంతోపాటు స్వచ్ఛంద సంస్థలు కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని ప్రతి యువకుడు, యువతి ఆత్మవిశ్వాసంతో ఇంటర్వ్యూలకు హాజరై ఉద్యోగాలను సాధించాలని ఆకాంక్షించారు. ఈ మెగా జాబ్ మేళాలో దాదాపు 90కు పైగా బహుళజాతి, ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయని, అభ్యర్థులకు అక్కడికక్కడే ఇంటర్వ్యూలు నిర్వహించి అర్హులైన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు వారి అర్హతలను బట్టి నెలకు రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు వేతనం లభించే అవకాశముందని వెల్లడించారు. పదో తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, బి.ఫార్మసీ, డి.ఫార్మసీ, నర్సింగ్, ఏదైనా డిగ్రీ, బీటెక్, పీజీ పూర్తి చేసిన 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు గల యువతీ, యువకులు ఈ జాబ్ మేళాకు అర్హులని మంత్రి వివరించారు. అభ్యర్థులు తమ విద్యార్హతల సర్టిఫికెట్ల జిరాక్స్ ప్రతులు, ఆధార్ కార్డు, రెండు పాస్పోర్ట్ సైజు ఫోటోలతో తప్పనిసరిగా హాజరుకావాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం 8688466361, 9390176421, 9966682246 నంబర్లను సంప్రదించాలని తెలిపారు.
ఆసక్తి కలిగిన అభ్యర్థులు ప్రభుత్వం అందుబాటులో ఉంచిన https://naipunyam.ap.gov.in/dashboard/module-drilldown?cardType=resume&fromPage=home-page&key=resume రిజిస్ట్రేషన్ లింక్ లేదా క్యూఆర్ కోడ్ ద్వారా ముందుగానే నమోదు చేసుకుని ఈ మహత్తర అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మనోహర్, దినకర్ రెడ్డి, ఇమ్రాన్ సమాన కాలేజ్ డిజైన్ స్టడీస్ డైరెక్టర్, సంస్కృతి సేవా సమితి కార్యదర్శి ఒంటేరు శ్రీనివాసులు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News